నిధుల్లేని కార్పోరేషన్లు, కుర్చీలేని ఛైర్మన్లు- నామినేటెడ్ పదవుల ప్రకటనపై టీడీపీ సెటైర్లు
ఏపీలో జగన్ సర్కార్ ఇవాళ ప్రకటించిన నామినేటెడ్ పదవులపై టీడీపీ పెదవి విరిచింది. నామినేటెడ్ పదవుల ప్రకటనతో సామాజిక న్యాయం చేస్తున్నట్లు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల చేస్తున్న ప్రకటనలపై టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు. వైసీపీ సర్కార్ పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల పేరుతో చేస్తున్న హడావుడి నవ్వుతెప్పిస్తోందని టీడీపీ నేత జవహర్ అన్నారు. దాదాపు 26 కీలక సంస్థలకు ఛైర్మన్లుగా సొంత సామాజికవర్గ నేతల్ని నియమించి పల్లకీలో ఊరేగిస్తూ.. అప్రధాన్యత కలిగిన పదవులను బడుగు బలహీన వర్గాలకు కట్టబెట్టడమే సామాజిక న్యాయమా. అని ఆయన ప్రశ్నించారు. టీటీడీ ఛైర్మన్ పదవిని మళ్లీ బాబాయికే కేటాయించడం బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఉద్దరించడమా.అని జవహర్ నిలదీశారు. బడుగులు టీటీడీ ఛైర్మన్ పదవికి పనికిరారా జగన్ రెడ్డీ.? నిధులు లేని కార్పొరేషన్లు.. కుర్చీల్లేని ఛైర్మన్ల నియామకంతో సామాజిక న్యాయం ఏ విధంగా జరిగిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు.
గతంలో ప్రకటించిన కార్పొరేషన్ కార్యాలయాల అడ్రస్ లే ఇంత వరకు తెలియదని, ఇప్పుడు ప్రకటించే పదవుల కార్యాలయాల అడ్రస్ చెప్పి.. తర్వాత ఛైర్మన్లను నియమించాలని ప్రభుత్వాన్ని టీడీపీ నేత జనహర్ డిమాండ్ చేశారు. నిధులు, విధులు లేని ఛైర్మన్ల నియామకంతో వారిని ఉత్సవ విగ్రహాల్లా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిని, సీట్లు దక్కలేదని అసంతృప్తితో ఉన్నవారిని సంతృప్తి పరచడం కోసమే తప్ప.. బడుగుల బతుకులు మార్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా లేదన్నారు.. రాజకీయ నిరుద్యోగుల్ని సంతృప్తి పరచి.. ప్రజలకు భారంగా మార్చడమే తప్ప చేసిందేమీ లేదని జవహర్ ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు పదవుల కేటాయింపు.. అసంతృప్తుల్ని కూల్ చేయడం కోసం మాత్రమేనన్నారు. ఏపీఐఐసీ, టీటీడీ వంటి పదవులకు బడుగు బలహీన వర్గాలకు అర్హత లేదా.అని జవహర్ ప్రశ్నించారు. కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని, సబ్ ప్లాన్ అస్తవ్యస్తం చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మూడున్నర కోట్ల మందిని వంచించి.. 135 పదవులు కేటాయించడం అండగా నిలవడమో.. నిండా ముంచేయడమో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.