రఘురామ బాటలోనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే-జగన్ సర్కార్ నుంచి ప్రాణహాని-CRPF భద్రత
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమకు భద్రత కరవైందని ఇప్పటికే టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా గతంలో నిత్యం సీఎం జగన్, వైసీపీ సర్కార్ పై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచేవారు. ఇదే క్రమంలో ఆయనకు బెదిరింపులు రావడంతో కేంద్రాన్ని ఆశ్రయించి సీఆర్పీఎఫ్ భద్రత పొందారు. ఇప్పుడు ఆయన బాటలోనే టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సైతం కేంద్ర బలగాల భద్రత కోరబోతున్నారు.
వైసీపీ హయాంలో కక్షసాధింపులు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విపక్ష టీడీపీ నేతలపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు.. ఇలా ఎవరినీ చూడకుండా అందరినీ వైసీపీ సర్కార్ టార్గెట్ చేస్తోంది. దీంతో వైసీపీ ప్రభుత్వంలో తమకు భద్రత కరువైందని టీడీపీతో పాటు ఇతర విపక్ష పార్టీల నేతలు గగ్గోలు పెడుతున్నారు. చెప్పిన మాట వినకపోతే బెదిరింపులకు దిగడం, అట్రాసిటీ కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారిపోయుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే తనకు జగన్ సర్కార్ తో ప్రాణహానీ ఉందని కేంద్ర ప్రభుత్వ బలగాలతో భద్రత కావాలని కోరబోతున్నారు.
చింతమనేనికి పోలీసులతో ప్రాణహాని ?
టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలకు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తోంది. చింతమనేనిపై వరుస కేసులతో విరుచుకుపడుతోంది. దీంతో ఏడాదిలో సగానికి పైగా ఆయన కేసుల్ని ఎదుర్కోవడంలో, జైలు జీవితం గడపడంలోనూ కనిపిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన తాజాగా తనకు ప్రాణహాని ఉందనే ఆరోపణల్ని తెరపైకి తెస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు వింటున్న పోలీసులతో తనకు ప్రాణహానీ ఉందని చింతమనేని ఆరోపిస్తున్నారు. దీంతో చింతమనేని వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
సీఆర్పీఎఫ్ భద్రత కోరుతున్న చింతమనేని
జగన్ సర్కార్ తో తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్న చింతమనేని ఈ విషయంలో ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదంటున్నారు. అసలు వారితోనే తనకు ప్రాణహాని ఉందని చెప్తున్న చింతమనేని, అందుకే కేంద్ర బలగాలతో తనకు భద్రత కల్పించాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు. సీఆర్పీఎఫ్ బలగాలను తన భద్రత కోసం నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి చింతమనేని త్వరలో హోంశాఖకు లేఖ రాయబోతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యేగా కూడా తనకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉన్నందున సీఆర్పీఎఫ్ భద్రత ఇవ్వాలని ఆయన కోరబోతున్నారు.
Recommended Video
రఘురామ బాటలోనే చింతమనేని
చింతమనేని ప్రభాకర్ చెప్తున్నట్లుగా కేంద్రాన్ని సీఆర్పీఎఫ్ భద్రత కోరితే వైసీపీ ప్రభుత్వంలో ఇలా కేంద్ర బలగాల భద్రత కోరిన రెండో నేత కానున్నారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో తనకు ప్రాణహాని ఉందంటూ కేంద్ర హోంశాఖను కోరి.. సీఆర్పీఎఫ్ భద్రత తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆయన వై ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్నారు. ఇప్పుడు రఘురామ బాటలోనే చింతమనేని కూడా తనకు సీఆర్పీఎఫ్ భద్రత కోరుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే రఘురామ సిట్టింగ్ ఎంపీ కాబట్టి అడిగిన వెంటనే ఆయనకు భద్రత కల్పించిన కేంద్రం.. ఇప్పుడు చింతమనేని విషయంలో అదే స్పీడుతో స్పందిస్తుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది.