టీడీపీలోకి మాజీ కేంద్ర మంత్రి?
తెలుగుదేశం పార్టీకి ఇరుసు లాంటి నేతను ఓడించారు. కేంద్రంలో మంత్రి పదవిని చేపట్టారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ అక్కడ తనకు అవమానం జరిగిందంటూ పదే పదే ప్రస్తావించే ఆ నేత ఇప్పుడు తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నేత ఎవరో కాదు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణి.
2004లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న డాక్టర్ కిల్లి కృపారాణి 2009 లోక్సభ ఎన్నికల్లో ఎర్రన్నాయుడిపై విజయం సాధించారు. మన్మోహన్సింగ్ హయాంలో కేంద్ర మంత్రి పదవికి చేజిక్కించుకున్నారు. అనంతర పరిణామాల్లో వైసీపీ తీర్థం పుచ్చుకొని ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. కానీ ఎమ్మెల్సీ దక్కకపోగా జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించి ధర్మాన కృష్ణదాస్కు అప్పగించడంతో ఆమె నిరాశకు గురయ్యారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా ఆమెను హెలిపాడ్ వద్దకు ఆహ్వానించలేదు. దీనిపై తీవ్ర మనస్తాపం చెందిన ఆమెను కార్యక్రమంలో పాల్గొనాలంటూ ధర్మాన కృష్ణదాస్ వెళ్లి బతిమాలినప్పటికీ ఆమె వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఆమె తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. పసుపు పార్టీతో ఆమె టచ్ లో ఉన్నారంటున్నారు. దీనిపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి టీడీపీ తరఫున పోటీచేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి లోక్ సభకు పోటీచేసి రెండోస్థానంలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి మూడోస్థానంలో నిలిచారు. దీనిపై ఆమె నేరుగా స్పందించనప్పటికీ ఆమె అనుచరులు మాత్రం టీడీపీలో చేరేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.