పదవీ విరమణ తరువాత వెంకయ్య నాయుడు ఏం చేస్తున్నారంటే..: అలా ఎంజాయ్..!!
అమరావతి: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ.. సీతారామం. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్, రష్మిక మందన్న, అక్కినేని సుమంత్ నటించారు. చలసాని అశ్వనీదత్ నిర్మాత. హను రాఘవపూడి దర్శకుడు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. కలెక్షన్లను కురిపిస్తోంది.
సూపర్ హిట్ టాక్తో..
ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రెవెన్యూను అందుకుంది. ఫిల్మ్ క్రిటిక్స్ సైతం ఈ మూవీపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఓ చిన్న సినిమాగా విడుదలై.. మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. దుల్కర్ సల్మాన్ నటించిన తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా కూడా ఇదే కావడం ప్రత్యేక ఆకర్షణ. రష్మిక మందన్న, మృణాల్ థాకూర్, సుమంత్ తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. హను రాఘవపూడి దర్శకత్వ మెరుపులు సినిమాను సూపర్ హిట్గా నిలబెట్టాయి.
వెంకయ్య మదిని దోచిన సినిమా..
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి మనసును దోచిందీ సినిమా. ఈ మూవీని ఆయన స్వయంగా తిలకించారు. చాలా బాగుందంటూ మెచ్చుకున్నారు. చిత్రం యూనిట్ను ప్రశంసించారు. చాలా కాలం తరువాత ఓ చక్కని సినిమాను చూసిన అనుభూతిని ఈ సీతారామం అందించిందని వెంకయ్య నాయుడు కితాబిచ్చారు. ఎలాంటి రణగొణధ్వనులు లేని ఓ మంచి సినిమాను చూశానని పేర్కొన్నారు. కంటికి ఇంపైన ప్రకృతి సౌందర్యాన్ని తెరకెక్కించారని చెప్పారు.
కళ్లకు హాయిగా..
రణగొణ ధ్వనులు లేకుండా, కళ్లకు హాయిగా, ఆహ్లాదకరంగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమా ద్వారా ఆవిష్కరింపజేశారని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఇలాంటి మంచి సినిమాను తెరకెక్కించిన నిర్మాత అశ్వినీదత్, స్వప్న మూవీ మేకర్స్ సహా చిత్రం యూనిట్ను అభినందిస్తున్నానని, ప్రతి ఒక్కరూ ఈ మూవీని తప్పనిసరిగా చూడాలని అన్నారు. నటీనటులు చక్కగా అభినయించారని పేర్కొన్నారు.
వీర సైనికుడి నేపథ్యం..
నటీనటుల అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైందని వెంకయ్య చెప్పారు. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించడం తనను బాగా ఆకట్టుకుందని అన్నారు. అనేక భావోద్వేగాలను కథానుగుణంగా ఈ చిత్రం ఆవిష్కరించిందని ప్రశంసించారు. ఈ మూవీని ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినదిగా అభివర్ణించారాయన. ఈ మేరకు ఓ ట్వీట్ను వెంకయ్య నాయుడు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
థ్యాంక్స్ చెప్పిన చిత్రం యూనిట్..
వెంకయ్య నాయుడు తమ సినిమాను ప్రశంసించడం పట్ల చిత్రం యూనిట్ ఉబ్బితబ్బిబ్బయింది. ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి మంచి సినిమాలను అందించే దిశగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని పేర్కొంది. హృదయపూరకంగా ధన్యవాదాలు తెలియజేస్తోన్నామంటూ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ థాకూర్, హను రాఘవపూడి ఆయనకు రిప్లై ఇచ్చారు.












Click it and Unblock the Notifications