అయ్యప్ప మాలలో ముస్లిం టోపీ పెట్టుకోవవద్దా ? ఏ శాస్త్రం చెప్పింది ? బీజేపీ నేతలకు అనిల్ ప్రశ్న
నెల్లూరులో అయ్యప్ప దీక్షలో ఉన్న తాను ముస్లింలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనడంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ తీవ్రంగా స్పందించారు. బీజేపీ నేతలది రాద్దాంతమేనని అనిల్ కుమార్ యాదవ్ ఆక్షేపించారు. హిందూ ముస్లింలను వేరు చేస్తూ బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కాదని మండిపడ్డారు.
అయ్యప్ప దీక్షలో ఉన్న తనపై బీజేపీ చేస్తున్న విమర్శల్ని అనిల్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతి అయ్యప్ప మాలదారుడు మొదట వావర్ స్వామి మసీదు దర్శిస్తాడని ఆయన బీజేపీ నేతలకు గుర్తుచేశారు. హిందూ మతం ఆచారాలు తెలిసి కూడా బీజేపీ నీచ రాజకీయాలకి పాల్పడుతోందన్నారు. నెల్లూరు బారా షాహిద్ దర్గా, కసుమూరు హజ్రత్ దర్గాలను హిందువులే అత్యధికంగా దర్శిస్తారని కూడా అనిల్ గుర్తుచేశారు.
అయ్యప్ప మాల ధారణతో నమాజ్ టోపి ధరించకూడదు అని శాస్త్రం ఉంటే చూపించాలని అనిల్ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేది అయ్యప్ప దీక్ష లోనే ఉందన్నారు. నేను చేసింది తప్పో..కాదో ప్రజలకు ఈ సమాజానికి బాగా తెలుసని అనిల్ వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు లాంటి సీనియర్ నేతలు కూడా చిల్లర వ్యాఖ్యలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని మాజీ మంత్రి అనిల్ వెల్లడించారు.