చంద్రబాబుకు ఐటీ నోటీసులపై స్పందించరే ? విపక్షాలకు మాజీ మంత్రి అనిల్ ప్రశ్న
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీశాఖ జారీ చేసిన వరుస నోటీసులపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ.. చంద్రబాబుతో పాటు ఇతర విపక్షాలను కూడా ఇందులోకి లాగే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. చంద్రబాబుకు ఇచ్చిన ఐటీ నోటీసులపై విపక్షాల్ని టార్గెట్ చేసేందుకు ప్రయత్నించారు. విపక్షాలపై అనిల్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుకు వచ్చిన నోటీస్ లపై ప్రతిపక్షాలు ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి అనిల్ యాదవ్.. విపక్ష పార్టీల అధినేతల్ని ప్రశ్నించారు. చంద్రబాబుకు జారీ అయిన నోటీసులపై పవన్ కళ్యాణ్, సీపీఐ నారాయణ , రామకృష్ణ, బీజేపీ పురంధరేశ్వరి ఎందుకు స్పందించడం లేదన్నారు. చంద్రబాబు మచ్చలు ఎవరు కడిగినా పోవు అన్నారు. చంద్రబాబుకు ఇచ్చిన నోటీస్ వైసీపీ ఇచ్చింది కాదని, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐటీ ఇచ్చిందన్నారు. చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులపై దత్తపుత్రుడు కూడా స్పందించలేదన్నారు.

దత్తపుత్రుడు మద్దతు తెలిపిన బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ నోటీస్ ఇచ్చినా కనీసం ఒక్క మాట మాట్లాడలేదని మాజీ మంత్రి అనిల్ ఆక్షేపించారు. వామపక్షాలు ఎక్కడికి పోయాయిని ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందన కూడా లేదని పేర్కొన్నారు. దీనికి కారణంగా పురందేశ్వరి బంధు ప్రీతా అని అనిల్ ప్రశ్నించారు. ఈ రోజుకి పురంధరేశ్వరి ఈ నోటీసులపై నోరు మెదపలేదని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరు ఊరు తిరుగుతున్న లోకేష్ కూడా ఉప్పు నిప్పు అంటాడు..మరి ఈ నోటీస్ లు కనిపించలేదా అని అడిగారు.
అమరావతి అనేది పెద్ద భూదందా అనేది రైతులు గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజలకు అన్ని విషయాలు అర్ధమయ్యాయని, దత్తపుత్రుడు మాట్లాడే సమయం వచ్చిందన్నారు. దుబాయ్ లో కూడా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని అనిల్ విమర్శించారు. అమరావతి ఒక భూటకమని, రైతులు ఈ విషయం గుర్తించాలని కోరారు.












Click it and Unblock the Notifications