నెల్లూరులో అనుచరులతో మాజీ మంత్రి అనిల్ కీలక భేటీ-బాబాయ్ వ్యవహారంపై ఇక తాడోపేడో ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిపోయింది. మరో 9 నెలల్లో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో నెల్లూరు జిల్లా రాజకీయాలు వైసీపీకి అంతుబట్టడం లేదు. గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లతో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి ఈసారి జిల్లాలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు షాకులిచ్చారు. దీంతో వారిని సస్పెండ్ చేశారు. అయితే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ రూపంలో ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది.
నెల్లూరు సిటీ నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పాటు మంత్రిగా కూడా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ కు ఆయన బాబాయ్, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తో అస్సలు పొసగడం లేదు. వీరిద్దరి మధ్య విభేదాలు తారా స్దాయికి చేరుకోవడంతో స్వయంగా సీఎం జగన్ జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. ఆ తర్వాత అయినా పరిస్దితిలో మార్పు వస్తుందని భావించినా అలా జరగలేదు. దీంతో ఇరువురూ రెండు వర్గాలుగా విడిపోయి నెల్లూరులో రాజకీయాలు నడుపుతున్నారు. అదే సమయంలో రూప్ కుమార్ కు పార్టీలో ప్రాధాన్యం కూడా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో తాడోపేడో తేల్చుకునేందుకు అనిల్ కుమార్ యాదవ్ సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం నెల్లూరు నగరంలోని విజయమహల్ గేటు సమీపంలోని ఎం.సీ.ఎస్.కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే అనిల్ అధ్యక్షతన నగర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో అనిల్ తన వైపు ఉన్న నేతలతో బల ప్రదర్శనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తద్వారా అధిష్టానానికి కూడా క్లారిటీ ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు.
మరోవైపు బాబాయ్ రూప్ కుమార్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. అనిల్ తో సై అంటే సై అంటున్న రూప్ కుమార్.. ఇప్పటికే నగరంలో ప్రత్యేకంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ పార్టీ పెద్దల దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్తున్నా ఆశించిన స్ధాయిలో స్పందన లేదని తెలుస్తోంది. దీంతో ఇవాళ పార్టీ నేతలతో కలిసి ఆయా అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications