Chandrababu Arrest : టీడీపీ సైలెంట్-పవన్, పురందేశ్వరి మాత్రం.. అనిల్ కామెంట్స్..
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో విపక్ష నేత చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. చంద్రబాబుకు మద్దతుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు, పురందేశ్వరి పెడుతున్న ట్వీట్లపై అనిల్ యాదవ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు పాపం పండిందని, ఆయనో అవినీతి ఆనకొండ అని అనిల్ వ్యాఖ్యానించారు. ఆయనకు వీరిద్దరూ ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు.
పేద విద్యార్థులకు నైపుణ్యం పేరుతో 370 కోట్లు దోపిడీతో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారని వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. టీడీపీ నేతలు బాబు నిప్పు అన్నారని, వ్యవస్థలను మ్యానేజ్ చేసుకున్న చంద్రబాబు పాపం ఇప్పుడు పండిందని అనిల్ విమర్శించారు,. 370 కోట్ల అవినీతి కేసులో చంద్రబాబు ముద్దాయన్నారు. కేంద్ర సంస్థ 118 కోట్ల ముడుపులు తీసుకున్నారని అంటే బిజెపి చీఫ్ పురందేశ్వరి నోరు మెదపలేదని గుర్తుచేశారు.

కానీ ఇప్పుడు సీఐడీ కేసులో మాత్రం మరిదికి పురందేశ్వరి వత్తాసు పలికారని అనిల్ కుమార్ యాదవ్ ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ చేసినంత హడావిడి టీడీపీ కార్యకర్తలు, సొంత కొడుకు కూడా చేయలేదని అనిల్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడే.. కుటుంబ సభ్యుడు కాదన్నారు. తన పార్టీ అధ్యక్షుడిని అరెస్టు చేసినట్లు నానా యాగీ చేశాడని పవన్ పై అనిల్ మండిపడ్డారు. దేశ చరిత్రలో ఒక పార్టీ అధ్యకుడ్ని అరెస్టు చేస్తే మరో పార్టీ అధ్యక్షుడు రోడ్డు మీదకు రావడం ఇదే తొలిసారి అన్నారు.
నిన్నటి చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ పూర్తిగా సైలెంట్ అయిపోయిందని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.
ఒక్క కార్యకర్త కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి లేదన్నారు. తద్వారా చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు నోరు మెదపలేని పరిస్ధితుల్లోకి వెళ్లిపోయారని అనిల్ ఆరోపించారు. కానీ పవన్ కళ్యాణ్, పురందేశ్వరి మాత్రం చంద్రబాబుకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారని అనిల్ విమర్శించారు.












Click it and Unblock the Notifications