బీఆర్ఎస్ గెలిస్తే జగన్ గెలుస్తాడని ? కానీ కాంగ్రెస్ పైనే 50 లక్షల పందెం-బాలినేని కామెంట్స్
ఏపీలో వైఎస్ జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన, ఆయనకు సన్నిహితుడిగా పేరున్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి పోయాక మాత్రం సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ మరో సంచలనానికి తెరలేపారు. సీఎం వైఎస్ జగన్ పై తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఆయనంటే తనకు అభిమానమని చెప్పుకొచ్చారు. అంతే కాదు తెలంగాణ ఎన్నికల్లో బెట్టింగ్ వేసేందుకు చేసిన ప్రయత్నాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో తాజాగా జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా అన్న చర్చలో అక్కడ బీఆర్ఎస్ గెలిస్తే ఏపీలో జగన్ గెలుస్తాడని తన కుమారుడు అనుకున్నట్లు బాలినేని వెల్లడించారు. ఏపీలో వైసీపీ రావాలని తన కుమారుడు కోరుకుంటున్నాడని, అయితే అదే సమయంలో జగన్ కూ తమపై అభిమానం ఉండాలి కదా అని ఆయన చెప్పారు.

తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని మా అబ్బాయి కోరుకున్నాడని, తెలంగాణ అంతా తిరిగి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడన్నారు. అయితే తాను మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందని 50 లక్షల రూపాయలు బెట్టింగ్ కాశానన్నారు. కానీ తన కుమారుడు ఫీలవుతాడని.. ఆ బెట్టింగ్ ను వెనక్కి తీసుకున్నట్లు బాలినేని చెప్పుకొచ్చారు.
ఈసారి ఒంగోలులో తనకు టిక్కెట్ ఇవ్వరని జిల్లాలో వేరే చోట టిక్కెట్ ఇస్తారని జరుగుతున్న ప్రచారాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. తాను ఒంగోలులో తప్ప మరెక్కడా పోటీ చేయబోనన్నారు. పాతిక వేల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని జగన్ కు తాను చెప్పానని బాలినేని వెల్లడించారు. తాను నీతి మంతుడినని చెప్పడం లేదని, మంత్రిగా ఉండగా ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నానని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను వెయ్యి కోట్లు సంపాదించానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.












Click it and Unblock the Notifications