చంద్రబాబు ఇంటికి అందుకే వెళ్లా-తేల్చిసిన జోగి రమేశ్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఓ రేంజ్ లో చెలరేగిపోయిన మాజీ మంత్రి జోగి రమేశ్ కు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ గా తీసుకోవడంతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓవైపు అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో ఆయన కుమారుడు రాజీవ్ అరెస్టు కాగా.. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఇవాళ ఆయన్ను పోలీసులు విచారించారు.
ఈ విచారణలో ఆయనపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. అప్పట్లో చంద్రబాబు ఇంటిపై దాడికి ఎందుకు వెళ్లారు, ఎవరు పంపించారు, దాడికి ఎవరితో కలిసి వెళ్లారు, అక్కడ ఎవరు ఏం చేశారన్న అంశాలపై పోలీసులు ప్రశ్నలు వేశారు. వాటికి జోగి రమేశ్ కూడా ఆసక్తికర సమాధానాలు ఇచ్చి బయటికి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను ఆయన వెల్లడించారు. పోలీసు విచారణలో కోర్టులోనే అన్నీ తేల్చుకుంటానని జోగి రమేశ్ తెలిపారు.

చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు తనను ప్రశ్నించినట్లు జోగి రమేశ్ తెలిపారు. అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలతో చలించిపోయి చంద్రబాబు ఇంటికి నిరసన తెలిపేందుకు వెళ్లినట్లు జోగి రమేశ్ తెలిపారు. 40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబుకు అయినా చెపుదామని వెళ్ళానన్నారు.
అయినా మంచి చెప్పాలని మాత్రమే వెళ్ళానన్నారు. క్షణికావేశంలో మాత్రమే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు.
దీనికి ప్రతిగా ఇప్పుడు తనపై, కుమారుడిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని జోగి రమేశ్ తెలిపారు. అగ్రిగోల్డ్ భూములపై స్పందిస్తూ మీరు ఏ విధంగా కొనుగోలు చేశారో మేము అలాగే కొనుగోలు చేశామన్నారు. తనపై కక్ష సాధింపు ఉండొచ్చు కాని తన కుమారుడిపై అమెరికాలో మంచి ఉధ్యోగం, చదువు ఉన్న తన కుమారుడిపై ఇలా చేయటం సబబేనా అని ప్రశ్నించారు. మీ పదవుల కోసం తన కుమారుడిపై కామెంట్స్ చేయొద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. ముఖ్యమంత్రి, అనగాని సత్యప్రసాద్, పవన్ కల్యాణ్ వద్ద దీనిపై చర్చకు సిద్ధమన్నారు.
తమపై కేసులు నమోదు చేయడం కంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయటంలో శ్రద్ధ చూపాలని కూటమి నేతల్ని జోగి రమేష్ కోరారు. కేవలం పరుష పదజాలం వాడితే గతంలో మాకు ప్రజలు ఏ తీర్పు ఇచ్చారో అదే తరహాలో తీర్పు మీకు ఇస్తారంటూ వ్యాఖ్యానించారు. ప్రజలకు అన్ని తెలుసు, అన్ని గమనిస్తున్నారు. తమకు న్యాయం న్యాయస్థానాలో జరుగుతుంది అనే నమ్మకం బలంగా ఉందన్నారు. తనను మళ్ళీ పోలీసులు రమ్మనలేదని, పోలీసులకు పూర్తిగా సహాకరించాని తెలిపారు.












Click it and Unblock the Notifications