Kodali nani: కొడాలి నానికి అస్వస్థత-ఫలితాల వేళ టెన్షన్..!
ఏపీలో వైసీపీ మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి కూడా అయిన కొడాలి నాని ఇవాళ అస్వస్థతకు లోనైనట్లు తెలుస్తోంది. గుడివాడలోని తన స్వగృహంలో కార్యకర్తలు, నేతలతో భేటీ అయి మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆయన కుప్పకూలినట్లు సమాచారం. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం కొడాలి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ఈసారి ఎన్నికలు ముగిశాక కొడాలి నాని గుడివాడలోనే ఉంటున్నారు. నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మండలాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ సరళి, ఇతర వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఇవాళ నందివాడ మండల వైసీపీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. వారితో చర్చిస్తున్న క్రమంలో నిలబడి ఉన్న కొడాలి నాని ఒక్కసారిగా కుప్పకూలినట్లు సమాచారం. దీంతో నేతలు, ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
కొడాలి నాని కుటుంబం ఎప్పటి నుంచో హైదరాబాద్ లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో కొడాలి అనారోగ్యానికి గురైన విషయాన్ని సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వారు హుటాహుటిన బయలుదేరి వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కరోనా బారిన పడిన కొడాలి నానికి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఎంజీ ఆస్పత్రిలో చికిత్స చేశారు. అనంతరం ఆయన కోలుకున్నారు. ఈసారి ఎన్నికల సమయంలో హోరాహోరీ పోరు నేపథ్యంలో ప్రచారంలో కొడాలి తీవ్రంగా శ్రమించారు. ఇప్పుడు ఫలితాలు వెలువడుతున్న వేళ కొడాలి అస్వస్థతకు గురికావడం చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications