పవన్ కామెంట్స్ కు పేర్ని కౌంటర్- మీరు నిద్రలేచే సరికే జగన్ సాయం...
వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు అగ్నికి ఆహుతైన నేపథ్యంలో మత్సకారులకు నిన్న పవన్ కళ్యాణ్ వెళ్లి జనసేన తరఫున సాయం అందించారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. వైజాగ్ వెళ్లడానికి బయలుదేరితే తన విమానం అదృశ్యం చేశారంటూ విమర్శించారు. దీనిపై ఇవాళ వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ నిద్రలేచే సరికే సీఎం జగన్ బోట్లు కోల్పోయిన మత్సకారులకు సాయం అందించారని గుర్తుచేశారు.
పవన్ మత్సకారులకు పంచిన డబ్బు కంటే ఆయన వచ్చి వెళ్లిన విమానం ఖర్చే ఎక్కువ అని పేర్నినాని విమర్శించారు. పవన్ తన దగ్గర డబ్బుల్లేవని చెబుతారని, కానీ డబ్బుల్లేకుంటే ప్రత్యేక విమానంలో వైజాగ్ కు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. నిన్న ఫిషింగ్ హార్బర్ లో పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయనకు సీఎం జగన్ పై విషం చిమ్మడం అలవాటుగా మారిందన్నారు. మత్సకారులకు సీఎం జగన్ ఏమీ చేయలేదని చెప్పడంపై స్పందిస్తూ 10 ఫిషింగ్ హార్బర్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

మత్సకారులకు సాయం చేసేందుకు పవన్ వెళ్లకముందే వైసీపీ సర్కార్ 7 కోట్ల సాయం అందించిందని పేర్నినాని తెలిపారు. కానీ పవన్ ఆలస్యంగా వచ్చి 50 వేలు ఇచ్చి 50 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారని పేర్ని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఫిషింగ్ హార్బర్లు కట్టారో చెప్పాలని పవన్ కు పేర్ని సవాల్ విసిరారు. పవన్-చంద్రబాబు ఇద్దరూ ప్రజల్ని ఓటర్లుగా మాత్రమే చూస్తారని ఆయన విమర్శించారు.
పవన్ కాపుల్ని మనుషుగా చూడరని పేర్ని విమర్శించారు. కాపుల్ని ఆస్తిగా, పెట్టుబడిగా చంద్రబాబుకు టోకుగా బేరం పెట్టేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇళ్లు, క్యాంపు కార్యాలయాల పేరుతో చేసిన ఖర్చుల వివరాల్ని ఈ సందర్భంగా పేర్నినాని వెల్లడించారు.












Click it and Unblock the Notifications