తెలంగాణకు చంద్రబాబు శుభాకాంక్షలా ? పేర్నినాని ఆశ్చర్యం-రెండు కళ్ల సిద్ధాంతంపై ఫైర్..
ఏపీ విభజన సందర్భంగా 2014కు ముందు చోటు చేసుకున్న పరిణామాల్లో ఇరుకున పడిన వారిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నారు. అప్పట్లో తెలంగాణకు చంద్రబాబు మద్దతు ఉందా లేదా అంటూ ప్రశ్నించిన వారికి ఆయన సమాధానం చెప్పేందుకు ఇబ్బందులు పడ్డారు. చివరికి ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని చెప్పి తప్పించుకున్నారు. ఇప్పుడు అదే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఆ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారం లో ఉన్నప్పుడు చెప్పారా అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్ 1న మాత్రమేనని చంద్రబాబుకు పేర్ని గుర్తుచేశారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది వైసీపీ స్టాండ్ అని పేర్నినాని తెలిపారు. చంద్రబాబు లాగా పూటకో నిర్ణయం కాదన్నారు.రెండు రాష్ట్రాలు విడగొట్టాలని తానే చెప్పానని చంద్రబాబు చెబుతున్నారని పేర్ని గుర్తుచేశారు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ పార్క్ శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అని, మరి బాబు ఏమి చేశాడని పేర్ని ప్రశ్నించారు. 2047 కి పేదల్ని కోటీశ్వరులను చేస్తారట, అప్పటికి బాబు వయసు ఎంత ఉంటుందని పేర్ని అడిగారు.
2020 పోయి 2047 వచ్చిందని, అధికారం లో ఉన్నప్పుడు ఏది చెయ్యడని పేర్నినాని ఆక్షేపించారు. చంద్రబాబు సంపద సృష్టించా అని చెప్తాడని, అసలు పొలాలు ఇచ్చిన వాళ్ళకి ఎవరికైనా ప్లాట్లు ఇచ్చాడా అని పేర్ని ప్రశ్నించారు. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కట్టచ్చుగా, ఎందుకు కట్టలేదని కూడా అడిగారు. పౌర విమనయాన శాఖా మంత్రి అప్పట్లో నీ జేబులో ఉంటే కనీసం వైజాగ్ ఎయిర్పోర్ట్ పనులు కూడా చెయ్యలేదుగా అని పేర్ని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications