పీఆర్సీపై తాడోపేడో-ఏకమైన ఉద్యోగులు-నేడు సచివాలయంలో భేటీ-కేబినెట్ సమయంలోనే
ఏపీలో ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు ఏకమయ్యారు. ఇప్పటివరకూ నాలుగు ఉద్యోగ జేఏసీలుగా పోరాటాలు చేస్తున్న ఉద్యోగులు.. ఇప్పుడు ఒకే తాటిపైకి రావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్త వేదికను కూడా ప్రకటించబోతున్నారు ఇవాళ సచివాలయంలో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో కేబినెట్ భేటీ కూడా జరగబోతుండయంతో సచివాలయంలో ఉద్రిక్తత తప్పేలా లేదు.
పీఆర్సీ పోరు తీవ్రం
ఏపీలో పీఆర్సీ పోరు తీవ్రమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన జీవోలపై నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న ఉద్యోగులు.. ఇవాళ దాన్ని పతాకస్ధాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం పీఆర్సీ జీవోలపై వెనక్కి తగ్గేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఉద్యోగులు తమ పోరును ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వారు గ్రామ స్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకూ పోరాటాన్ని ముమ్మరం చేయబోతున్నారు. ఇందుకోసం కార్యాచరణను రాష్ట్రస్ధాయిలో జేఏసీలు ప్రకటించబోతున్నాయి.
ఏకతాటిపైకి ఉద్యోగసంఘాలు
రాష్ట్రంలో ఇప్పటివరకూ నాలుగు ప్రధాన జేఏసీలుగా పనిచేస్తున్న ఉద్యోగసంఘాలు తమ ఉమ్మడి సమస్య అయిన పీఆర్సీపై ఇప్పుడు ఏక తాటిపైకి వచ్చారు. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ, ఏపీ సచివాలయ సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కలిసి పీఆర్సీ పోరాట సమితి పోరుతో ఒకే వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం విజయవాడలోని ఓ హోటల్లో రహస్యంగా సమావేశమైన ఉద్యోగసంఘాల నేతలు.. ఇవాళ సచివాలయంలో మరోసారి సమావేశమై తుది నిర్ణయం ప్రకటిస్తారు.
ఇవాళ సమ్మె నోటీసులు
ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోల్ని వ్యతిరేకిస్తూ సమ్మెలోకి వెళ్లేందుకు సైతం ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సీఎస్ కు సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఉద్యోగసంఘాలు సిద్దమవుతున్నాయి. సచివాలయంలో జరిగే ఉద్యోగసంఘాల జేఏసీల సమావేశం తర్వాత ఉమ్మడిగా వెళ్లి సీఎస్ సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఉద్యోగులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవాళ నోటీసు ఇచ్చి ఫిబ్రవరి 5 నుంచి సమ్మెకు వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల సమ్మె వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది.
కేబినెట్ భేటీ సమయంలోనే
ఇవాళ అమరావతి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతోంది. అదే సమయంలో ఉద్యోగసంఘాల జేఏసీలు అదే సచివాలయంలోని సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సమావేశంలో నాలుగు జేఏసీలు ఉమ్మడి పోరుకు కార్యాచరణ ప్రకటించబోతున్నాయి. అలాగే ఈ సమావేశం తర్వాత సమ్మె నోటీసు ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో కేబినెట్ సమావేశంలోనూ దీనిపై చర్చ జరగబోతోంది. ఉద్యోగుల పోరుపై కేబినెట్ సమావేశంలోనూ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కేబినెట్ భేటీ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సచివాలయంలో ఉద్యోగసంఘాలు భేటీ అవుతున్నట్లు అర్దమవుతోంది. అయితే ప్రభుత్వం వీరి ఒత్తిడికి తలొగ్గుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.