పిల్లల్ని చంపేశాం, మేమూ చనిపోతున్నాం: సౌమ్య ఫోన్
విశాఖపట్నం: పిల్లలను ఇద్దరినీ చంపి భర్త రాజేష్ రెడ్డితో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సౌమ్య చెన్నైలోని తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. చివరిసారిగా ఆమె వారితో మాట్లాడింది.
విషాదం: పిల్లలను చంపేసి, భార్యాభర్తలు ఉరేసుకున్నారు
విశాఖపట్నంలోని అరిలోవలో విషమిచ్చి పిల్లలను చంపేసి, సౌమ్య భర్త రాజేశ్ రెడ్డితో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సౌమ్య చెన్నైలోని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన కొద్దిసేపటికి పోలీసులు వచ్చేసరికే ఇంట్లో నలుగురు శవాలై కనిపించారు.
పిల్లలను చంపేశాం, మేం కూడా..
పిల్లలిద్దర్నీ చంపేశామని, తాము కూడా చనిపోతున్నామని సౌమ్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. ఇంటి చట్టుపక్కల ఉండేవారితో రాజేశ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎక్కువగా మాట్లాడేవారు కాదని సమాచారం. అదే సమయంలో దంపతులు గొడవ పడిన సంఘనలు కూడా లేవని అంటున్నారు.
మద్యం సేవించినట్లుగా..
నలుగురు మరణించిన ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. రాజేష్ మద్యం సేవించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ముందుగానే పిల్లల్ని చంపినట్లు తెలుస్తోంది. సౌమ్య తల్లితండ్రులు తమ కూతురు నుంచి ఫోన్ రాగానే ఆరిలోవ సీఐకి ఫోన్ చేసి చెప్పారు. దీంతో రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. అడ్రస్ తెలియక చాలాసేపు గాలించారు.
ఎట్టకేలకు గుర్తించారు..
తీవ్రంగా గాలించిన పోలీులు చివరకు రాత్రి తొమ్మిది గంటలకు ఆ ఇంటిని కనిపెట్టారు. తలుపులు వేసి ఉండడంతో పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. భార్యాభర్తలు ఎదురెదురుగా ఉరికి వేళ్లాడుతూ కనిపించారు. మంచంపై పిల్లల శవాలు పడి ఉన్నాయి. సౌమ్య తన తండ్రికి రాసిన లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఓ కేసు కారణంగా..
చనిపోవడానికి ముందు సౌమ్య తన తండ్రిని ఉద్దేశించి ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. "ఓ కేసు కారణంగా ఇప్పటికీ నిందలు భరిస్తున్నా. నాన్నా! నా కోసం చాలా చేశావు. కానీ నా జీవితం ఇలా అయిపోయింది. ఓ కేసు వల్ల నన్ను అందరూ వేధిస్తున్నారు. వాళ్ల ఆగడాలు భరించలేకపోతున్నాను. నాకు బతకాలని లేదు. రెండేళ్లు గడిచిపోయినా ఇంకా అవే నిందలు మోపుతున్నారు. నేను తప్పు చేయలేదు. నన్ను నమ్మండి. ఈ లోకంలో బతకడం చేత కావడం లేదు' అని సౌమ్య ఆ లేఖ రాసినట్లు మీడియాలో వచ్చింది.