తెలంగాణపై నల్గురు: నాలుగు అజెండాలు, తిరకాసు
హైదరాబాద్/న్యూఢిల్లీ: లోకసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)ను ప్రవేశ పెట్టడం, సోమవారం నుండి లోకసభలో చర్చ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఇటు హైదరాబాదులో, అటు ఢిల్లీలో మరోసారి వేడెక్కాయి. ఓ వైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా ఉత్కంఠ రేపుతుండగా మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమన్యాయం అంటూ జాతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు.
ఇంకోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం జోరుగా లాబీయింగ్ చేస్తుండగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ముసాయిదా బిల్లు కోసం మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక ఎపిఎన్జీవోలు, టిఎనన్జీవోలు ఢిల్లీలో మాకాం వేశారు. ఇరు ప్రాంతాల నేతలు, ఉద్యోగ సంఘాలు ఢిల్లీలో కాక పుట్టిస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఛలో ఢిల్లీ కోసం ఎపిఎన్జీవోలు పిలుపునివ్వగా వేలాది మంది ఇప్పటికే ఢిల్లీకి రైళ్లలో బయలుదేరారు. దీంతో ఢిల్లీ పోలీసులు వారిపై ఆరా తీస్తున్నారు. వారు ఢిల్లీకి చేరుకోగానే పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాపై...
ముఖ్యమంత్రి రాజీనామాపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రోజు... రేపు అంటూ కిరణ్ రాజీనామాపై ప్రచారం సాగుతోంది. పలువురు సీమాంధ్ర ప్రాంత నేతలతో కిరణ్ ఆదివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో కిరణ్ తన రాజీనామాపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎపిఎన్జీవోల ఢిల్లీ సమావేశానికి వెళ్లాలా లేదా కూడా చర్చిస్తారు.
చంద్రబాబు సమన్యాయం
చంద్రబాబు సమన్యాయం కోసం ఇటీవలి వరకు జోరుగా ఢిల్లీలో మంతనాలు జరిపారు. చెన్నైకి వెళ్లి కరుణానిధిని, జయలలితను, పశ్చిమ బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీని, ముంబై వెళ్లి ఉద్దవ్ థాకరేలను చంద్రబాబు కలుసుకున్నారు. విభజనల కాంగ్రెసు పార్టీ సమన్యాయం పాటించలేదని వారి దృష్టికి తీసుకు వెళ్లారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ సమన్యాయం డిమాండ్ తెలంగాణను ఆపేందుకేనని తెలంగాణవాదుల వాదన. చంద్రబాబు కాంగ్రెసుతో కలిసి విభజనకు సహకరిస్తున్నారనేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపణ.
సమైక్యం కోసం జగన్
వైయస్ జగన్ సమైక్యం కోసం ఢిల్లీలో జోరుగా లాబీయంగ్ చేస్తున్నారు. బిజెపి, లెఫ్ట్, జెడి(యు)... ఇలా అన్ని పార్టీల నేతలను కలుస్తూ సమైక్యాంధ్రకు మద్దతివ్వాల్సిందిగా జగన్ కోరుతున్నారు. అయితే, జగన్ పలువురు జాతీయ పార్టీ నాయకులను కలుస్తూ విభజన జరిగితే తమ పార్టీకి సీమాంధ్రలో ఎక్కువ సీట్లు వస్తాయని, మీకు మద్దతిస్తానని హామీ ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ, పలువురు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ కోసం కెసిఆర్
లోకసభలో బిల్లు ప్రవేశపెట్టినందున ఆ బిల్లును నెగ్గించేందుకు కెసిఆర్ ఢిల్లీలో తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అదే సమయంలో కేంద్రానికి పలు సవరణలు, తమ డిమాండ్లు పెడుతున్నారట. బిల్లు పెట్టిన నేపథ్యంలో సవరణలపై పట్టుబట్టొద్దని జైరామ్ రమేష్ ప్రత్యేకంగా ఆయనను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇక బిల్లుకు అంగీకారం తెలిపితేనే కాంగ్రెసు పార్టీలో విలీనమా లేక పొత్తా అనేది ఆయన తేల్చనున్నారు.
కిరణ్ భేటీలో...
కాగా, సాయంత్రం ఐదు గంటల వరకు కిరణ్ భేటీకి ఐదుగురు మంత్రులు, ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు, ఐదారుగురు ఎమ్మెల్సీలు వచ్చారు. మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, కాసు వెంకటకృష్ణా రెడ్డి, పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాస రావు, శత్రుచర్ల విజయ రామరాజులు వచ్చారు.
విభజన కాస్త ఆలస్యమైతే ఏమైంది?
చంద్రబాబు ఢిల్లీలోని విమానాశ్రయంలో ములాయం సింగ్ యాదవ్తో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. విభజన కాస్త ఆలస్యమైతే పోయేదేముందన్నారు. పార్లమెంటు ఘటనకు సోనియానే కారణమని, ఇరు ప్రాంత నేతలు, ప్రజలతో చర్చించాలన్నారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నారు.