నలుగురు విద్యార్థులు గల్లంతు: ఒడ్డుకు చేరిన శవాలు
విశాఖపట్నం: విశాఖపట్నం ఆర్కె బీచ్లో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. బీచ్లో స్నానానికి దిగిన విద్యార్థులను ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటాలు సముద్రంలోకి లాక్కుపోయాయి. వారిలో ఇద్దరి మృతదేహాలు సోమవారం ఉదయం ఒడ్డుకు చేరాయి. వారిని రోహిత్, జబ్బార్లుగా గుర్తించారు. మిగతా ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు కూడా ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి.
విశాఖపట్నం నగరంలోని అల్లిపురంలోని ఒక పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఆదివారం ఆర్కె బీచ్కు వచ్చారు. వీరిలో నలుగురు విద్యార్థులు స్నానానికి దిగగా, కెరటాల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. వీరిలో ఒకరిని స్థానికుడు రక్షించగా, ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యంకాలేదు. గల్లంతైన వారిలో గణేష్, రోహిత్, జబ్బర్లు టెన్త్ క్లాస్ చదువుతున్నారు.
ఆర్కె బీచ్లో ఇదే సంఘటనలో మరో యువకుడు షరీఫ్ కూడా సముద్రంలో స్నానానికి దిగి గల్లంతైనట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన జరిగిన వెంటనే నగర పోలీసు కమిషనర్ అమిత్గార్గ్ బీచ్కు చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పరిశీలించారు. కమ్యూనిటీ గార్డులతోపాటు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. అవసరమైతే నేవీ, కోస్ట్గార్డ్ సహకారం తీసుకోవాలని మంత్రి గంటా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.