అమరావతిలో ఆమ్రపాలి ఎంట్రీ-మరో ముగ్గురు ఐఏఎస్ ల రిపోర్టింగ్..!
ఇప్పటివరకూ తెలంగాణలో ఉన్న నలుగురు ఐఏఎస్ అధికారులు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖతో పాటు క్యాట్, తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇవాళ ఏపీ సచివాలయానికి వచ్చారు. అమరావతి సచివాలయానికి వచ్చిన నలుగురు తెలంగాణ ఐఏఎస్ అధికారులు కాటా ఆమ్రపాలి, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్ .. ఇక్కడ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ కు రిపోర్ట్ చేశారు. వీరికి త్వరలో పోస్టింగ్ లు ఇచ్చే అవకాశం ఉంది.
తాజాగా ఏపీ, తెలంగాణకు చెందిన మొత్తం 11 మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసిన కేటాయింపుల మేరకు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీలో పనిచేస్తున్న ఇద్దరు ఐఏఎస్ లు తెలంగాణకు, అలాగే తెలంగాణలో ఉన్న నలుగురు ఐఏఎస్ అధికారులు ఏపీకి రావాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అలాగే పలువురు ఐపీఎస్ అధికారులు కూడా రాష్ట్రాలు మారాల్సి వచ్చింది.

కేంద్రం ఆదేశాలపై వీరిలో పలువురు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమను ఇప్పుడు పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే కేంద్రం ఆదేశాల తర్వాత కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించిన వీరికి నిరాశ తప్పలేదు. దీంతో తెలంగాణ హైకోర్టు కూడా అదే ఆదేశాలు పాటించాల్సిందేనని తేల్చిచెప్పేసింది. అసలు కేంద్రం చెప్పిన విధంగా రిపోర్ట్ చేసి ఆ తర్వాత తమ వద్దకు రావాలని కూడా హైకోర్టు సూచించింది. దీంతో వీరు కేంద్రం చెప్పినట్లుగానే రిపోర్టింగ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications