తిరుపతి, హైదరాబాద్, పుణె, బెంగళూరు వారికి ముఖ్య గమనిక
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 26 మార్గాల్లో ఇవి పరుగులు తీస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందేభారత్ లు పరిగెడుతున్నాయి. మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్న ఇండియన్ రైల్వే మరో నాలుగు రైళ్లను కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది.అందులో మూడు రైళ్లు హైదరాబాద్ నుంచి పరుగులు తీస్తాయి.
దేశవ్యాప్తంగా 10 వందేభారత్ రైళ్లను ప్రారంభించబోతున్నారు. అందులో నాలుగు రైళ్లు ఏపీ, తెలంగాణను కవర్ చేస్తాయి. కాచిగూడ-యశ్వంత్పూర్, సికింద్రాబాద్-పుణె, సికింద్రాబాద్-నాగ్పూర్, విజయవాడ-చెన్నై రైళ్లు రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-పూణె రూట్లో వందే భారత్ రైళ్ల ట్రయల్ రన్ పూర్తయింది. ప్రస్తుతం సికింద్రాబాద్-పూణె మార్గంలో శతాబ్ధి ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంది. శతాబ్ధి ఎక్స్ప్రెస్ బదులుగా వందే భారత్ ను ప్రవేశపెట్టబోతున్నారు.

విజయవాడ నుంచి చెన్నై వెళ్లే వందేభారత్ తిరుపతి మీదగా ప్రయాణించనుంది. తిరుపతి వెళ్లేవారికి కూడా సౌలభ్యంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఈ మార్గంలో తిప్పనున్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ నాలుగు కూడా వస్తే వీటి సంఖ్య ఆరుకు చేరుతుంది.
కాచిగూడ-బెంగళూరు మధ్య వందే భారత్ రైట్, టైమింగ్స్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిని రైల్వే అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కాచిగూడ-బెంగళూరు మధ్య 8.30 గంటల్లో ప్రయాణించవచ్చు.ఈ రైలు ఉదయం 6.00 గంటలకు కాచిగూడలో బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు యశ్వంత్పూర్ చేరుకుంటుంది. ఇదే రైలు యశ్వంత్పూర్లో మధ్యాహ్నం 3.00 గంటలకు బయల్దేరి రాత్రి 11.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్-పుణె మధ్య కూడా 8.30 గంటల్లో, సికింద్రాబాద్-నాగపూర్ మధ్య 7 గంటల్లో ప్రయాణించవచ్చు.












Click it and Unblock the Notifications