50 నిమిషాల్లో బుడుతడు తిరుమల కొండెక్కాడు
తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు నాలుగేళ్ల బాలుడు 50 నిముషాలకే 2,700 మెట్లు ఎక్కిన సంఘటన బుధవారం చంద్రగిరిలో చోటుచేసుకుంది.
కృష్ణాజిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామానికి చెందిన సాయిబాబా, వరలక్ష్మీ దంపతుల నాలుగేళ్ల కుమారుడు భువనేశ్వర్ సత్యం చంద్రగిరి వైపుఉన్న శ్రీవారి మెట్లు వద్దకు చేరుకుని 11.35 గంటలకు మెట్లు ఎక్కడం ప్రారంభించి 12.25 నిముషాలకు తిరుమలకు చేరుకున్నాడు.
50 నిముషాల్లో 2,700 మెట్లు ఎక్కి సంచలనం సృష్టించడంతో తిరుమలలో బాలుడ్ని పలువురు అభినందించారు. ఆ రకంగా ఆ బుడుతడు చరిత్ర సృష్టించాడు. అతడు కొండెక్కిన వార్తాకథన, కొండెక్కుతున్నప్పుడు తీసి ఛాయాచిత్రం గురువారం మీడియాలో వచ్చింది.
తమ కుమారుడికి నడక అంటే భలే ఇష్టమని, అతను ఇలా కొండెక్కడం ఇది ఆరోసారి అని అతని తల్లిదండ్రులు చెప్పారు. సాధారణంగా తిరుమల కొండ ఎక్కడానికి రెండు నుంచి రెండున్నర గంటలు పడుతుంది. క్రమం తప్పకుండా ఎక్కేవారు గంటన్నర సమయం తీసుకుంటారు.