వైసీపీ సభ్యుల ప్లకార్డుల ప్రదర్శన: స్పీకర్ అసహనం, 15 నిమిషాల పాటు వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నాల్గవరోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. దీంతో సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.
సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు.
వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని కోరుతూ వైసీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దని స్పీకర్ విపక్ష సభ్యులకు సూచించారు. ప్లకార్డులు సభలోకి తీసుకురావద్దంటూ స్పీకర్ వైసీపీ సభ్యులకు సూచించారు.
వాయిదా తీర్మానంపై చర్చకు అనుతించాలనంటూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్ష సభ్యులు సహకరించాలని కోరారు. అయినప్పటికీ, ప్రతిపక్ష ప్లకార్డులతో నిరసన చేపట్టడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.