ఏపీలో మహిళలతోపాటు వీరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈనెల 15వ తేదీన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పించబోతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. విశాఖపట్నం నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. మహిళలతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఉచితంగా ప్రయాణించేందుకు బస్పాస్ లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 50వేల మందికి పైగా
సీవియర్ హీమోఫిలియా, లెప్రసీ, థలసేమియా, లివర్ పక్షవాతం, కిడ్నీ, గుండెజబ్బులు.. తదితర వ్యాధులతో బాధపడుతున్నవారు ఆసుపత్రుల చుట్టూ తిరగాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వస్తోంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రభుత్వం నుంచి పింఛన్లు పొందుతున్నవారికి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పించే దిశగా కసరత్తులు చేస్తోంది. ఇలా పింఛన్లు పొందుతున్నవారు రాష్ట్రవ్యాప్తంగా 50వేల మందికి పైగా ఉన్నట్లు అంచనా. వీరిలో ప్రధానంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు నెలకు రెండుసార్లు ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. మరికొందరు మాత్రం ఆసుపత్రులకు వెళ్లేందుకు అంబులెన్స్ సేవలను పొందుతున్నారు. వీటిల్లో ప్రయాణించే ఖర్చు భారీగా అవుతోంది. వారికి ఈ తరహా ఇబ్బందులను తొలగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత ప్రయాణంపై ఆలోచిస్తోంది.

విజయవాడ, విశాఖ నగరాల్లో కూడా
మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు రూ.250 కోట్ల భారం పడుతున్నట్లు అధికారులు నివేదిక అందజేశారు. విధివిధానాలు రూపొందించేందుకు ఈ పథకం అమలవుతున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేశారు. ప్రస్తుతం ఏపీలో ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేవారి సంఖ్య 36 లక్షలుగా ఉంటోంది. వీరిలో 15 లక్షల మంది మహిళలుంటారు. ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులతోపాటు విశాఖపట్నం, విజయవాడల్లో తిరుగుతున్న సిటీబస్సుల్లో కూడా వీరికి ఉచిత రవాణా సదుపాయం కల్పించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications