జగన్ కు పాత మిత్రుల సెగ-కేటీఆర్ వ్యాఖ్యలతో మరోసారి-కేసీఆర్ నుంచి స్టాలిన్ వరకూ దూరమై..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో సీఎం జగన్ కు అందరూ మిత్రుల్లాగే కనిపించేవారు. ముఖ్యంగా జగన్ ప్రమాణస్వీకారానికి హాజరైన కేసీఆర్, స్టాలిన్ నుంచి మొదలుపెడితే నవీన్ పట్నాయక్ వంటి వారు కూడా జగన్ కు అనుకూలంగా ఉన్నట్లే కనిపించేవారు. అందుకే ఇన్నాళ్లూ వారు జగన్ ఎలా వ్యవహరించినా సంయమనం పాటించే వారు. కానీ తాజాగా ఆ పరిస్ధితి మారిపోయినట్లే కనిపిస్తోంది. ఇవాళ ఏపీ అభివృద్ధిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దీనికి పరాకాష్టగా చెప్పొచ్చు. అయితే ఈ పరిణామాలన్నింటికీ ఒకే రీజన్ కనిపిస్తోంది.
ఒకప్పటి జగన్ మిత్రులు
ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆయనకు పొరుగు రాష్ట్రాలకు చెందిన కీలక ప్రాంతీయ పార్టీల నేతలతో అంతగా సంబంధాలు ఉండేవి కావు. వైసీపీని ఎలాగైనా అధికారంలోకి తెచ్చే క్రమంలో వారితో కనీస సంబంధాలు కొనసాగించే తీరిక కూడా జగన్ కు ఉండేది కాదు.
కానీ జగన్ అధికారంలోకి రాగానే కేసీఆర్, స్టాలిన్ వంటి వారిని తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. అప్పటికి సీఎంగా లేని స్టాలిన్ వంటి వారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. దీంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు మూడు రాష్ట్రాల సీఎంల సఖ్యతపై ఉత్తరాదిలోనూ చర్చ జరిగేది.కేసీఆర్, కేటీఆర్ తో జగన్ స్నేహం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు.
ఒక్కొక్కరుగా జగన్ కు దూరం
గతంలో మిత్రులుగా ఉన్న వారిలో ఒక్కొక్కరుగా జగన్ కు దూరమవుతూ వచ్చారు. వీరిలో ముందుగా కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల వివాదాలతో కేసీఆర్, కేటీఆర్ దూరం కాగా.. ఆ తర్వాత బీజేపీతో అంటకాగుతున్న జగన్ కు కాంగ్రెస్ తో పొత్తు కొనసాగిస్తున్న స్టాలిన్ కూడా దూరమయ్యారు.
ఇదే క్రమంలో మధ్యలో జగన్ ను తన వద్దకు పిలిపించుకుని మరీ చర్చలు జరిపిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం ఇప్పుడు కత్తులు దూస్తున్నారు. దీంతో ఏకంగా దక్షిణాదిలోనే మూడు రాష్ట్రాల సీఎంలు జగన్ కు దూరమైనట్లయింది. అయితే వీరంతా దూరం కావడానికి ప్రధాన కారణం మాత్రం ఒకటేనని తెలుస్తోంది.
కేటీఆర్ వ్యాఖ్యల మంట
జగన్ కు తన పాత మిత్రులైన కేసీఆర్, కేటీఆర్ దూరమయ్యారనే విషయం బహిర్గతమే అయినా ఇవాళ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో వీరి బంధం ఎంత బలహీనంగా మారిందో అర్ధమవుతోంది. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ఏపీతో పోలిస్తే తమ రాష్ట్రం ఎంతో మెరుగ్గా ఉందని చెప్పుకొచ్చారు.
ఇదే క్రమంలో ఏపీలో రోడ్లు లేవు, కరెంటు లేదు, నీరు లేదంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వానికీ, జగన్ కీ మంటపుట్టిస్తున్నాయి. దీంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ పై ఎదురుదాడికి దిగుతున్నారు.
బీజేపీ స్నేహంతో వారంతా దూరం
అధికారంలోకి రాకముందు బీజేపీతో అంటీ ముట్టనట్టుగా ఉన్న జగన్ .. ఆ తర్వాత మాత్రం కేంద్రంతో సత్సంబంధాల పేరుతో బీజేపీకి దగ్గరయ్యారు. అంతేకాదు బీజేపీ అడిగినా అడక్కపోయినా కేంద్రంలో మద్దతిస్తూ వస్తున్నారు. వ్యవసాయ బిల్లుల విషయంలో అయితే అందరూ బీజేపీకి మద్దతివ్వాలని వ్యాఖ్యలు చేయడం, కేంద్రాన్ని విమర్శించే పార్టీల నేతలకు కౌంటర్లు వేయడంతో వారందరికీ కంటగింపుగా మారారు. ఇదే క్రమంలో కేసీఆర్, స్టాలిన్, నవీన్ వంటి నేతలు జగన్ కు పూర్తిగా దూరం పాటిస్తున్నారు. అంతే కాదు తమ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలకూ జగన్ ను ఆహ్వానించడం లేదు.
జగన్ కు తప్పదు మరి..
కేంద్రంలో బీజేపీతో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించడం జగన్ కు సాధ్యం కాదు. అలా చేస్తే వైసీపీ ఓటు బ్యాంకు అయిన మైనార్టీతో పాటు ఎస్సీ, ఎస్టీలు కూడా దూరం కావడం ఖాయం. దీంతో వారందరి ఓట్ల కోసమేనా జగన్ బీజేపీతో పరోక్ష సంబంధాలకు పరిమితం కావాల్సిందే. అదే సమయంలో తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటే కేంద్రంతో సత్సంబంధాలు తప్పనిసరి. అందుకే ఏపీకి అప్పులు ఇవ్వకపోయినా, ఆంక్షలు పెడుతున్నా కేంద్రానికి జగన్ తప్పనిసరిగా మద్దతివ్వాల్సి వస్తోంది.
ఇందులో ఎక్కడ తేడా వచ్చినా జగన్ కు బీజేపీ శత్రువుగా మారుతుంది. అదే జరిగితే ఏమవుతుందో చంద్రబాబు అనుభవాలు జగన్ కు తెలియనివి కావు. అందుకే జగన్ అనివార్యంగా మిత్రుల్ని దూరం చేసుకుని మరీ బీజేపీకి అండగా నిలుస్తున్నారు.