పవన్ కళ్యాణ్లాగే కొత్తగా: సమస్యలపై వినూత్నంగా ఆ నేత ఆలోచన, ప్రశంసలు
నిడదవోలు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొత్త తరహా రాజకీయాలు చేస్తున్నారు. ప్రజా సమస్యల విషయంలో విమర్శలు చేయడంలో ఓ శైలి పాటిస్తున్నారు. సాధారణంగా పార్టీలు అంటే మంచి, చెడు అని లేకుండా విమర్శలు చేసుకోవడమే ఉందని, కానీ తాను అలాంటి రాజకీయాలు చేయడానికి రాలేదని పవన్ పదేపదే చెబుతున్నారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్నారు. రాజకీయ విమర్శలు తప్పితే, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదు.
పవన్ కళ్యాణ్ దారిలోనే వారి కార్యకర్తలు కూడా నడుస్తున్నారు. సమస్యలపై ఒకింత కొత్త దారిలో నడుస్తున్నారు. రాజకీయాల్లో జనసేనకు మిగతా పార్టీల అంత అనుభవం లేదు. కానీ సమస్యల విషయంలో వినూత్నంగా ఆలోచిస్తోంది. పవన్ ఆయా నియోజకవర్గాలు, జిల్లాలకు వెళ్లినప్పుడు ఆ ప్రాంత సమస్యలను ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా ఆయన మేజర్ సమస్యలపై దృష్టి సారిస్తున్నారు.
సమస్యలపై వినూత్న ఆలోచన
ఆయా ప్రాంతాల్లోని, నియోజవకవర్గాల్లోని, గ్రామాల్లోని జనసైనికులు తమ తమ ప్రాంతాల్లోని, గ్రామాల్లోని సమస్యలను అధికార పార్టీ దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిడదవోలు జనసేన నేత కస్తూరి సత్యప్రసాద్ (నాని) ఇటీవల 10వేస పోస్టుకార్డులను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పంపిస్తున్నారు. పరిపాలన సరిగా లేకపోవడంతో తమ ప్రాంతంలోని ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆయన పేర్కొన్నారు.
రెడ్ రెవల్యూషన్
కస్తూరి సత్యప్రసాద్ అంతకుముందు, రెడ్ రెవల్యూష్ పేరుతో గ్రామాల్లోని సమస్యలపై గోడలకు ఎక్కించి వినూత్నంగా అధికార పార్టీ దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభించారు.
నానికి అభినందనలు
రెడ్ రెవల్యూషన్కు సంబంధించిన ఉద్యమంపై పార్టీ ముఖ్య నేతల నుంచి అతనికి ప్రశంసలు అందాయి. అతను ఆయా గ్రామాలు, ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించి, అక్కడి గోడలపై రాస్తున్నారు. జనసేన పార్టీ - రెడ్ రెవల్యూషన్ పేరుతో గోడలపై ఎరుపు రంగు వేసి, తెల్లటి అక్షరాలతో సమస్యలు రాశారు. ఇందుకు పార్టీ నుంచి ప్రశంసలు వచ్చాయి. ఈ వినూత్న ఆలోచన జిల్లాలోని ఇతర నియోజకవర్గాలు, గ్రామాలకు కూడా పాకింది. ఫ్లెక్సీలు వేసి కూడా సమస్యలను తెలుపుతున్నారు.
పదివేల పోస్టుకార్డులు
పోస్టు కార్డు ద్వారా తమ ప్రాంతాల్లోని సమస్యలను తెలుపుతూ పదివేల పోస్టుకార్డులను చంద్రబాబుకు పంపిస్తున్నారు. ఒక్కో గ్రామానికి ఒక్కో సమస్య ఉంటుంది. ఆయా గ్రామాల్లోని సమస్యలను పోస్టుకార్డుల్లో రాశారు. వీటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి, వారి స్పందన కోసం వేచి చూస్తారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడమే తమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు.