బురిడీ బాబా.. కిలాడి లేడీ, వెలుగులోకి ఆసక్తికర విషయాలు!
ఒంగోలు: నెల్లూరు సుధాకర్ మహరాజ్ అనే బురిడీ బాబా దోపిడీ కేసులో కీలక పత్రాలతోపాటు, నగదు మాయం చేసినట్లు అనుమానిస్తున్న కిలాడీ లేడీ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆమె పూర్తిపేరు మెతుకు వెంకట నాగవాసవి అని.. ఆమెది ఒంగోలు అని తేలింది.
చదవండి: షాకింగ్: నటి ఎదుటే కారులో హస్తప్రయోగం చేసిన డ్రైవర్!
నగరంలోని మిరియాలపాలెంకు చెందిన ఆమె సునీల్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత సునీల్ నుంచి విడిపోయి విజయవాడకు చెందిన ఆంజనేయులుతో ఆరేళ్లు సహజీవనం చేసింది. ప్రస్తుతం ఆమెకు ఆరేళ్ల కుమార్తె ఉంది. ఆ తర్వాత అతడిని కూడా వదిలేసి ఒంగోలులో ఫర్నిచర్ షాపు నడుపుతున్న ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది.
వీరిద్దరూ నెల్లూరులోని సుధాకర్ మహరాజ్ ఆశ్రమానికి వెళ్లేవారు. ఈ క్రమంలో సుధాకర్ మహరాజ్కు నాగవాసవి ముఖ్య అనుచరురాలిగా మారింది. ఒంగోలుకు చెందిన కొందరిని ఆశ్రమంలో సిబ్బందిగా నియమించి ఆధిపత్యం చెలాయించినట్లు తెలుస్తోంది.
సుధాకర్ మహరాజ్ ఇష్టకామ్యయాగం పేరుతో ఆశ్రమానికి వచ్చే ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయడంలో నాగవాసవి కీలక పాత్ర పోషించిందని, ఈ డబ్బును ఆమె సొంత ఖాతాలకు మళ్లించిందని, ప్రముఖులంతా వాసవి సూచనలకు అనుగుణంగా ఆశ్రమానికి వచ్చి వెళ్లేవారని తెలిసింది.
ఇటీవల ఒంగోలులోని టూటౌన్ పోలీసుస్టేషన్ సమీపంలోని గోవిందరాజు వీధిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఆమె ఆశ్రమంలో పూజలు జరిగే సమయంలో మాత్రమే అక్కడికి వెళ్లి వస్తున్నట్లు సమాచారం. ఇష్టకామ్య యాగం పేరుతో 170 మంది నుంచి రూ. 2.50 కోట్లు వసూలు చేసిన కేసులో సుధాకర్ను నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకోడంతో ఆశ్రమంలో నగదు, కీలక పత్రాలు తీసుకుని వాసవి పరారైంది.
కొంత నగదును తనతో సన్నిహితంగా మెలిగే ఒంగోలుకు చెందిన బాషా, అలాగే తన సోదరుడు రాజాకు పంపినట్లు పోలీసుల విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. ఆమె తన ఆరేళ్ల చిన్నారితో కలిసి పరారవుతుండగా నెల్లూరు జిల్లా తడ సమీపంలో పోలీసులు శనివారం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయాన్ని నెల్లూరు పోలీసులు ధ్రువీకరించలేదు. ఒంగోలులో ఆమె బంధువులు, తల్లి, సన్నిహితులు వాసవి సమాచారం తెలిపేందుకు అంగీకరిచడం లేదు. నాగవాసవి గతంలో ఇంకేమైనా మోసాలకు పాల్పడిందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.