అమరావతి నుంచే వైసీపి పూర్తి స్థాయి కార్యకలాపాలు..! హైదరాబాద్ లో నామమాత్రమే..!!
అమరావతి/హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయిలో తాడేపల్లికి మారనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ప్రధాన కార్యాలయం పనులను పర్యవేక్షించారు. అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ... మరో పది రోజుల్లో తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయం అందుబాటులోకి వస్తుందన్నారు.
ఇక నుంచి పార్టీ కార్యకలాపాలు అన్ని ఇక్కడ నుంచే జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లడం, పార్టీకి సంబంధించిన నియామకాలు అన్ని ఇక్కడ నుంచే జరుగుతాయని అన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి పథక, వ్యూహ రచనలు తాడేపల్లి నుంచే జరుగుతాయని అన్నారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు నవరత్నాల ద్వారా లబ్ది పొందాలని, ప్రజలుకు మంచి పరిపాలన ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళుతుందని విజయసాయి రడ్డి పేర్కొన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మంగళగిరి పట్టణానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాకతోనే మహర్దశ పట్టనుందని తెలిపారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరిలో వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారనే అక్కసుతో గత టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో ప్రధాన పట్టణంగా ఉన్న మంగళగిరి అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళగిరి ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంపై రాజకీయ పార్టీలతో పాటు పట్టణ వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బడ్జెట్లో వ్యవసాయం, విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించడం శుభపరిణామమని అన్నారు విజయసాయి రెడ్డి.