దత్తన్నతో ఇంద్రకరణ్ భేటీ: పుష్కరాలకు రూ. 500కోట్లు(ఫొటోలు)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగనున్న గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని కసరత్తులు చేస్తోందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ఇందుకు రూ.500 కోట్లు కేటాయించేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు మరో రూ.750 కోట్లు సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిఎం కెసిఆర్ కోరినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో భేటీ అయ్యారు. కాసేపు ఆయనతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కామన్గుడ్ ఫండ్ నిర్వహణకు గతంలో సిఎం చైర్మన్గా ఉండేవారని, ప్రస్తుతం దేవాదాయశాఖ మంత్రినే చైర్మన్గా చేస్తూ సిఎం ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. దీంతో తాను గురువారం మొదటి సమీక్షాసమావేశం నిర్వహించినట్లు చెప్పారు.
వివిధ దశల్లో ఉన్న 695 పనులు పూర్తి అయ్యేందుకు రూ.76 కోట్లు అవసరమని సమావేశంలో అంచనా వేసినట్లు తెలిపారు. పుష్కరాల నిర్వహణకు ఆదిలాబాద్కు రూ.4.25 కోట్లు, నిజామాబాద్కు 1.7 కోట్లు, ఖమ్మం జిల్లాకు రూ.1.70, కరీంనగర్కు రూ.4.35 కోట్లు, వరంగల్కు రూ.90 లక్షలు కేటాయించనున్నట్లు వివరించారు.