పవన్ కు కాపు కాయని కాపులు..! కాపులను సరిగ్గా టార్గెట్ చేయలేకపోయిన గబ్బర్ సింగ్..!!
అమరావతి/హైదరాబాద్ : 2014లో ప్రభుత్వాన్ని కాపులు నిర్ణయించినట్టే 2019లో కూడా కాపులే డిసైడ్ చేసారు. ఎవరు ఔనన్నా, కాదన్నా ఇది పచ్చి నిజం. కాపులు కూడా జీర్ణించుకోలేని నిజం. కాపు వర్గానికి ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా., కాపు సామాజికవర్గంలో కొందరు మేధావులకు ఇదే భావన నెలకొని ఉన్నమాట వాస్తవం. ఏపీలో 2019లో పూర్తిగా కుల ప్రాతిపదికమీదనే పోరాటం సాగుతుందనేది ముందుగానే ఊహించిన విషయం. ఓటు బ్యాంకు అధికంగా ఉన్న కాపులను దగ్గర చేసుకోవటం ద్వారా టీడీపీ 2014లో పవర్లోకి రాగలిగింది. దీనికి పవన్ కళ్యాణ్ కూడా తన వంతు సహకారం అందించారు.
ఘోరంగా దెబ్బతిన్న కాటమరాయుడు..!!
ఏపిలో కాపు నేతలంతా తన వెనకే ఉన్నారని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ భావించడం కూడా ఇబ్బందికర పరిస్థితులను తెచ్చి పెట్టింది. అయితే ఆ తరువాత చింతమనేని ప్రభాకర్, జేసీ దివాకర్రెడ్డి, అచ్చెన్నాయుడు వంటి నేతలు.. పవన్ లేకపోతే మేము మరిన్ని సీట్లు ఎక్కువగా గెలుచుకునేవాళ్లమంటూ నోరుజారి పవన్ను దూరం చేసుకున్నారు. దీంతో పవన్ కూడా కాపుల ద్వారా అధికారం సాధించాలనే ఆశపడ్డాడు. అయితే అదే సమయంలో కర్ణాటకలో చోటుచేసుకున్న పరిణామాలతో పవన్ దూకుడు పెంచాడు. తాను కూడా కుమారస్వామిగా సీఎం కావచ్చని ఏదోమూలన ఆశపడినట్టున్నారు కాటమ రాయుడు.
కాపులకు భరోసా ఇవ్వలేక పోయిన గబ్బర్ సింగ్..! పవన్ ని పరిగణలోకి తీసుకోలేకపోయిన కాపులు..!!
అలా.. గెలుపే లక్ష్యంగా కొంతమేర ప్రయత్నించారు. అయితే.. పవన్ను ఏపీ ఓటర్లతో పాటు.. కాపులు కూడా టీడీపీ నమ్మినబంటుగా.. పచ్చిగా చెప్పాలంటే టీడిపి ఏజెంట్గానే భావించారు. అప్పటికే కమ్మ నేతలతో దెబ్బతిన్న కాపులు.. మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే భరించలేమనే భావనకు చేరారు. దీంతో పవన్ను కేవలం కాపుల్లోని యువ ఓటర్లు మాత్రమే అంగీకరించి ఓటేశారు. ఆ విధంగా సుమారు 33 లక్షలకు పైగా ఓట్లు సంపాదించారు.
పవన్ ని రెండు చోట్ల ఓడించిన కాపులు..! ఎందుకా అసహనం..?
పవన్ రెండుచోట్ల ఓటమి చవిచూడటంతో జనసైనికులకు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదేసమయంలో కాపులపై అటు కమ్మ, ఇటు రెడ్డి వర్గాల నుంచి దెప్పిపొడుపు మాటలు మొదలయ్యాయి. 2009లో చిరంజీవిని నమ్మి కాంగ్రెస్, టీడీపీల నుంచి బయటకు వచ్చిన నేతలు.. రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్ధకం చేసుకున్నారు. ఇప్పుడు పదేళ్ల తరువాత తమ్ముడి చేతిలోనే అదే అనుభవాన్ని చవిచూశారు. అలా బాహాటంగా మెగా కుటుంబాన్ని అక్కున చేర్చుకుని.. డబ్బులు వెచ్చించిన రాజకీయ నేతల్లో అధికశాతం కాపులే ఉన్నారు. అదే ఇపుడు కాపుల ఉనికిని ప్రశ్నార్ధకంగా చేసింది.
ఓవర్ కాన్పిడెన్స్ కొంపముంచిందా..! తొందరపడ్డ పవన్ కళ్యాణ్..!!
మరో ఐదేళ్ల వరకూ కాపులకు సంక్షేమపథకాలు అందుతాయా లేదా అనే అనుమానాలున్నాయి. ప్రభుత్వ శాఖల్లో కీలకమైన పదవుల్లో ఉన్న కాపు అధికారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జగన్ కూడా కాపులను వైరివర్గంగానే భావిస్తున్నారనే అనుమానాలు కాపుల్లో బలంగా నాటుకున్నాయి. అటు.. టీడీపీ, ఇటు వైసీపీ రెండుపార్టీలకు ఓట్లేసిన కాపు ఓటర్లు.. తాము ఎవరి వైపు అంటూ జాలిగా చూడటం.. కాపు సామాజికవర్గానికి పవన్ ద్రోహం చేశాడా లేక పవన్ కి కాపు సామాజిక వర్గం ద్రోహం చేసిందా అనే అంశంపై లోతైన చర్చ జరుపుకుంటున్నారట ఆ నేతలు. ఇక రాబోవు రోజుల్లో ఇదే సామాజిక వర్గం ఎవరికి అండగా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది.