అందుకే విభజనకు జగన్ ఓకే చెప్పారు: గాలి, ఏపీ మంత్రికి చిరంజీవి పరామర్శ
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు శుక్రవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ తన బెయిల్ కోసం రాష్ట్ర విభజనకు అంగీకరించారని ఆరోపించారు.
జగన్ ఏపీకి ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా కోరలేదన్నారు. బెయిల్ కోసమే విభజనకు అంగీకరించడం దారుణమన్నారు. విభజన సమయంలో రూ.5 లక్షల ప్యాకేజీ వచ్చి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేదన్నారు. ఏపీకి హోదా కావాలని జగన్ లోకసభలో అడగలేదన్నారు.
కాపులకు వైసిపి అనుకూలం: బొత్స, దేవినేనిపై జోగి ఆగ్రహం
కాపులను బీసీలలో చేర్చేందుకు వైసిపి అనుకూలమని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు ఉద్యమానికి అందరు కలిసి రావాలన్నారు.
మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఒక్క చుక్క నీరు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారని జోగి రమేష్ మండిపడ్డారు. జలవనరుల శాఖను దేవినేని ధనవనరుల శాఖగా మార్చారన్నారు. సాగునీరుకు, తాగునీరుకు ఎంత ఇచ్చారో బహిరంగ చర్చకు రావాలని జోగి సవాల్ చేశారు.
మంత్రి కామినేనికి చిరంజీవి పరామర్శ
గుంటూరు ఆసుపత్రిలో శస్ర్తచికిత్స చేయించుకొని డిశ్చార్జ్ అయి హైదరాబాద్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవి పరామర్శించారు. సతీసమేతంగా వచ్చిన చిరంజీవి కామినేనితో కాసేపు మాట్లాడారు. మంత్రి కామినేని శ్రీనివాస్ను తన అధికారిక నివాసంలో ఏపీ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కూడా పరామర్శించారు.
ఏపీ కొత్త సీఎస్గా ఎస్పీ టక్కర్ నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సత్య ప్రకాష్ టక్కర్ నియమితులయ్యారు. ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 ఆగస్టు నెలాఖరు వరకు ఆయన సీఎస్ గా కొనసాగుతారు.
1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన టక్కర్ నిన్నటి వరకు ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత సీఎస్గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచీ ఐవైఆర్ నవ్యాంధ్ర సీఎస్గా చేస్తున్నారు.