తొక్కిసలాటలు కామన్.. : గాలి, వివాదస్పదమవుతోన్న కామెంట్స్..!
విజయవాడ : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో గత గోదావరి పుష్కరాల తొక్కిసలాట అంశం మరోసారి చర్చనీయాంశం అవుతోంది. పుష్కరాల సందర్బంగా భక్తులకు ఇబ్బందులకు తలెత్తకుండా చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం, పుష్కరాలను బెగ్గర్ ఫ్రీ గా మార్చే ఉద్దేశంతో బిచ్చగాళ్లను కూడా నగరంలో కనిపించవద్దని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే నేతల మాట తీరు పుష్కరాల భద్రతపై ప్రజల్లో అపోహలను కలిగించేదిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అసలు విషయమేంటంటే.. రాజమండ్రికి వచ్చిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాట గురించి తేలిగ్గా కొట్టిపారేశారు. 'లక్షలాది మంది భక్తులు హాజరయ్యే పుష్కరాల్లో తొక్కిసలాటలు చోటు చేసుకోవడమన్నది సాధారణమే' అని ఆయన వ్యాఖ్యానించడం విమర్శలకు తావిస్తోంది.

అలాగే పుష్కరాల్లో తొక్కిసలాట అనేది ఏ ఒక్కరి బాధ్యతో కాదు కాబట్టి ఎవరిపైనా చర్యలు తీసుకోవడం జరగదన్నారు. దీంతో గాలి ముద్దుకృష్ణమ నాయుడు నిర్లక్ష్య వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజా కృష్ణ పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన నేత, ఇలా.. తొక్కిసలాటలు కామన్ అంటూ వ్యాఖ్యలు చేయడం ప్రతిపక్షాలకు పనిచెప్పేది గానే మారింది.












Click it and Unblock the Notifications