జగన్తో డీల్ కుదర్చడం వల్లే కెవిపికి రెండోసారి: గాలి
హైదరాబాద్: కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య ఒప్పందం కుదిర్చింది రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు శుక్రవారం ఆరోపించారు. జగన్కు బెయిల్, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేలా వారి మధ్య ఒప్పందం ఉందన్నారు. డీల్ కుదిర్చినందునే కెవిపిని రెండోసారి రాజ్యసభకు పంపించారన్నారు.
జగన్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెసు పార్టీకి వసినట్లే అన్నారు. టైటానియం కుంభకోణం పైన సిబిఐచే విచారణ జరిపించాలని గాలి గవర్నర్ను డిమాండ్ చేశారు. ఈ కుంభకోణం నేపథ్యంలో కెవిపిచే రాజీనామా చేయించాలన్నారు. అమెరికాలో వచ్చిన వార్తలను అవాస్తవమంటున్నారని, ఇది దేశ పరువు, ప్రతిష్ట్లకు సంబంధించిన అంశమన్నారు. నేరాల్లో కెవిపికి భాగస్వామ్యం ఉందన్నారు. కెవిపిని ఇంకా కాంగ్రెసు పార్టీ ఎందుకు ఉపేక్షిస్తోందన్నారు.
పొత్తు అవసరం: కోడెల
తెలుగుదేశం, బిజెపిల మధ్య పొత్తు ఇరు పార్టీలకు అవసరమని టిడిపి నేత కోడెల శివ ప్రసాద్ అన్నారు. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ జగన్ ఏ ముఖంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని విమర్శించారు.
కెసిఆర్ పైన జగ్గారెడ్డి
తెరాస ఉప ఎన్నికల పార్టీ అని జగ్గారెడ్డి మండిపడ్డారు. కెసిఆర్ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని, ఆయన మాటలు ఎవరు నమ్మరన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాకే దక్కుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెసు ప్రభుత్వమే వస్తుందన్నారు. కాంగ్రెసు పార్టీ మాటల పార్టీ కాదని చేతల పార్టీ అన్నారు.