కెసిఆర్ కాపీ, పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషి: గాలి, పవన్కు రఘువీరా సపోర్టు
హైదరాబాద్/ అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు ఖండించారు. సీఎం హోదాలో కేసీఆర్ భాష సరిగా లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.కెసిఆర్కు భాషలో శిక్షణ ఇవ్వాలని ముద్దుకృష్ణమనాయడు అన్నారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకొని, అలీబాబా దొంగలను మించి పోయారని ఆయన కెసిఆర్పై దుమ్మెత్తిపోశారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిలో ఆంధ్రా వాళ్లను పదేపదే వెళ్లిపోమనడం సరికాదన్నారు. చంద్రబాబును చూసి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాపీ కొడుతున్నారని ఆరోపించారు. బీజేపీ- టీడీపీ కూటమికి పవన్కళ్యాణ్ శ్రేయోభిలాషి అని , తమకు సాయం చేసిన పవన్ను తాము గౌరవిస్తామన్నారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (ఎపిపిసిసి) అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తోందని ఆయన గురువారం అనంతపురంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. అదే సమయంలో ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ వైఖరిని ఆయన సమర్థించారు.
జన్మభూమి కమిటీ సభ్యుడి నుంచి మొదలు పెడితే సిఎం చంద్రబాబు వరకు దోచుకోవడం దాచుకోవడమే సింగిల్ ఎజెండాగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. వారు చేసే పనికి ఎవరు అడ్డు వచ్చినా ఖాతరు చేయడం లేదని ఆయన అన్నారు.
తాజాగా దెందులూరులో మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై టిడిపి ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసిన సంఘటనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని రఘువీరా రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క టిడిపి ఎమ్మెల్యే ఈ విధంగానే ఉన్నారని ఆయన అన్నారు. అవినీతి, దౌర్జన్యాలపై ఆదేశాలు జారీ చేస్తే ప్రభుత్వ అధికారులను తలనొప్పి ఉండదని ఆయన అన్నారు.
ఎపికి ప్రత్యేక హోదాపై ప్రశ్నించే హక్కు పవన్ కళ్యాణ్కు మాత్రమే కాదు ఎవరికైనా ఉందని ఆయన అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు మాజీ ఎఁపి అనంత వెంకటరెడ్డి పేరు తొలగించడం దారుణమని రఘువీరా అన్నారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటిస్తారని ఆయన చెప్పారు.