ప్రత్యేక హోదా: చేతులు జోడించి వేడుకున్న గల్లా జయదేవ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు. దీనిపై టిడిపి పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ సభలో స్పందించారు. ఆయన లోకసభలో స్పందించారు. చేతులు జోడించి వేడుకుంటున్నానని, ఏపీకి అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కేంద్రంపై ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. ఏపీకి ఎటువంటి ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదన్నారు.
ఇచ్చిన వాటినే ప్రత్యేక నిధులు అని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ఉందన్న గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఆలస్యంగా న్యాయం జరిగినా.. అన్యాయం జరిగినట్లేనన్నారు.
ఇక వినే ఓపిక లేదు
విభజన సందర్భంగా, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏపీకి బిజెపి, కేంద్రం చాలా హామీలు ఇచ్చిందని గల్లా చెప్పారు. పార్లమెంటు లోపలా, వెలుపలా ఇదే తంతు కొనసాగిందన్నారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా.. విభజన చట్టంలోని హామీలను కేంద్రం ఇంకా పూర్తిగా నెరవేర్చలేదన్నారు. లోటు బడ్జెట్ తో అతలాకుతలమవుతున్న ఏపీ కేంద్రం నిధులు అరాకొరా విదుల్చుతోందన్నారు. మాటలు చెప్పే సమయం ముగిసిపోయిందన్నారు.
ఇంకా మాటలు చెప్పుకుంటూ పోతే ప్రజలు ఊరుకోరని చెప్పారు. తక్షణం ఏపీకి న్యాయం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రజలకు, మాకు ఇక వినే ఓపిక లేదన్నారు. చేతలు కావాన్నారు. ఏపీకి నిధులు ఎలా కేటాయిస్తారు? ఎంత కేటాయిస్తారు? ఇచ్చిన హామీలు ఎలా నేరవేరుస్తారు? ఎంత సమమం లోపు నెరవేరుస్తారని పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేయాలని ప్రశ్నించారు.