మహేష్ను లాగకండి, టిడిపికి మద్దతివ్వలేదు, దిగజారొద్దు: వైసిపిపై జయదేవ్
నంద్యాల ఉప ఎన్నికల్లో నటుడు మహేష్ మద్దతు తమకు ఉందని వైసిపి నాయకులు ప్రచారం చేశారు. దీనిపై టిడిపి నేత, ఎంపీ గల్లా జయదేవ్ శనివారం స్పందించారు.
గుంటూరు: నంద్యాల ఉప ఎన్నికల్లో నటుడు మహేష్ మద్దతు తమకు ఉందని వైసిపి నాయకులు ప్రచారం చేశారు. దీనిపై టిడిపి నేత, ఎంపీ గల్లా జయదేవ్ శనివారం స్పందించారు.
మహేష్ అందరివాడు, వైసిపిది దిగజారుడు రాజకీయం
ఆయన గుంటూరులో మాట్లాడారు. మహేష్ బాబు అందరివాడు అని, ఏ పార్టీకి చెందినవాడు కాదని తేల్చి చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో, కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో మహేష్ బాబు మద్దతు తమ పార్టీకి ఉందని వైసిపి నేతలు ప్రచారం చేయడం దిగజారుడు రాజకీయమన్నారు.
మహేష్ బాబు నాకు మద్దతిచ్చారు తప్పితే టిడిపికి కాదు
టిడిపి 2014లో తాను టిడిపి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా మహేష్ బాబు తనకు వ్యక్తిగతంగానే మద్దతు ఇచ్చారు తప్ప, టిడిపికి మద్దతు పలకలేదని గల్లా జయదేవ్ గుర్తు చేశారు. ఆయన ఏ పార్టీకి మద్దతివ్వరన్నారు. గల్లా జయదేవ్ బావ కాబట్టి మహేష్ బాబు వ్యక్తిగతంగా ఆయనకు మద్దతిచ్చారు.
మహేష్ బాబును లాగకండి
మహేష్ బాబుకు రాజకీయాలతో సంబంధం లేదని, ఆయనను అందులోకి లాగవద్దని జయదేవ్ విజ్ఞప్తి చేశారు. ఆయనకు అసలు రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. తన మామ సినీనటులు కృష్ణ, ఆయన కుమారుడు మహేష్ బాబు, కుటుంబ సభ్యులందరం చర్చలు జరిపిన తర్వాతే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. గుంటూరు ఎంపీగా పోటీ చేయమని సలహా ఇచ్చింది కృష్ణేనని గుర్తుచేశారు. మహేష్బాబు పూర్తి మద్దతు తనకు ఉంటుందన్నారు.
మహేష్ ఫ్యాన్స్కు సూచన
కృష్ణ, మహేష్బాబు అభిమానులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతు పలకాలని జయదేవ్ కోరారు. కాకినాడ ఎన్నికల్లో వారు టిడిపికి మద్దతు ఇస్తే బాగుంటుందన్నారు. ఇటీవల కృష్ణ, మహేష్బాబు ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
రూ.200 నోటుపై..
రూ.200లు నోటు ప్రవేశపెట్టాలని తాను మూడు పర్యాయాలు పార్లమెంటులో ప్రస్తావించానని జయదేవ్ చెప్పారు. రూ.2000 నోటు రద్దు చేసి, రూ.200 నోటు ప్రవేశపెడితే, నల్లధనాన్ని నియంత్రించే అవకాశం ఉంటుందన్నారు.