'1' చూసిన మహేష్ బావ గల్లా, పోస్ట్ చేస్తామని ఎమ్మెల్యే
గుంటూరు/చిత్తూరు: ప్రముఖ నటుడు కృష్ణ అల్లుడు, మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ బుధవారం గుంటూరు జిల్లాలోని మెట్రో థియేటర్లో తన బావమరిది ప్రిన్స్ మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' చిత్రాన్ని వీక్షించారు. ఆయన తన సతీమణితో కలిసి ఈ చిత్రాన్ని చూశారు. ఈ సందర్భంగా జయదేవ్ విలేకరులతో మాట్లాడారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో తాను తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసే విషయమై ఈ నెల 26వ తేదీ తర్వాత చెబుతానని ఆయన అన్నారు.
రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదని చెబుతా: జెసి
ఈ నెల 17వ తేదీన జరిగే ఏఐసిసి సమావేశానికి తాను వెళ్తానని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసన సభ్యులు జెసి దివాకర్ రెడ్డి వేరుగా చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి ఏమీ బాగాలేదని తాను సమావేశంలో వివరిస్తానన్నారు.
23 తర్వాత కండువాలు పోస్టులో పంపిస్తాం: ఆదాల
ఈ నెల 23వ తేదీ తర్వాత కాంగ్రెసు పార్టీ కండువాలను తాము పార్టీ అధిష్టానానికి పోస్టులో ఢిల్లీకి పంపిస్తామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెసు ఎమ్మెల్యే ఆదాల అన్నారు. నెలాఖరులోగా తాను పార్టీ వీడుతానని చెప్పారు.
జైపాల్ వ్యాఖ్యలు ఖండించారు: సిఎం రమేష్
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి సీమాంధ్ర నేతల పైన విమర్శలు చేస్తే కాంగ్రెసు పార్టీ నేతలు ఘాటుగానే స్పందించారని తెలుగుదేశం పార్టీ ఎంపి సిఎం రమేష్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ను అరికట్టలేకపోవడం సిగ్గు చేటు అన్నారు.