లడ్డూ పాట: గణేష్ లడ్డూని దక్కించుకున్న ముస్లిం
హైదరాబాద్: గణేష్ లడ్డూని వేలంపాటలో ఓ ముస్లిం సోదరుడు దక్కించుకున్నాడు. ఈ ఘటన వరంగల్ లోని సెకండ్ బ్యాంక్ కాలనీలో జరిగింది. దీంతో అక్కడ మత సామరస్యం వెల్లివిరిసింది.
గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్బంగా ఇక్కడ ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూను వేలం పాటలో రూ. 51వేలకు మహ్మాద్ రషీద్ సొంతం చేసుకున్నాడు. లడ్డూని దక్కించిన సంతోషంలో రషీద్ మాట్లాడుతూ గణేష్ లడ్డూని దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు.
పోటెత్తిన భక్తులు
ఖైరతాబాద్లో కొలువైన కైలాస విశ్వరూప మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నానికి భారీగా పెరిగింది. మహాగణపతిని దర్శించుకునేందుకు గాను జంట నగరాల నుండే కాకుండా, వివిధ ప్రాంతాల నుండి, సమీపంలో ఉన్న జిల్లాల నుండి వస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో వర్షాలు భారీగా కురుస్తున్నా.. భక్తుల తాకిడి మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. భారీ ఎత్తున తరలి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేశారు.