షాక్: గ్యాంగ్ ఆఫ్ ఫోర్ దోపిడీలు, 20 అత్యాచారాలు
గుంటూరు: దోపిడీలకు, అత్యాచారాలకు పాల్పడిన నలుగురు సభ్యులతో ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చూడడానికి విద్యార్థుల మాదిరిగానో, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ల మాదిరిగానే కనిపించే ఆ నలుగురు కత్తులతో బెదిరించి దోపిడీలకు పాల్పడ్డారు, దాదాపు 20 అత్యాచారాలు చేశారు. చివరకు తాడేపల్లి పరిధిలో ఓ యువతిని అత్యాచారం చేసేందుకు యత్నించి దొరికిపోయారు.
ఈ ముఠా కోసం విజయవాడ పోలీసులు ఏడాదిగా గాలిస్తున్నారు. విచారణలో వెల్లడించిన వివరాలతో సీసీఎస్ పోలీసులు షాక్కు గురయ్యారు. పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ సీసీఎస్ ఏఎస్పీ బీపీ తిరుపాల్, సీసీఎస్-1 డీఎస్పీ పీ శ్రీనివాస్ నిందితులను వివరాలను వెల్లడించారు.
విజయవాడ పరిధిలోని నున్న-పాయకరావుపేట మధ్య 200 ఎకరాల్లో వేసిన వెంచర్లో ఖాళీ ప్లాట్ల వద్దకు ప్రేమ జంటలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో జంటలు వెళ్తుంటాయి. ఇదే అదునుగా తాడేపల్లికి చెందిన దేవర వినోద్కుమార్, మేడా నాగరాజు, ఎర్రబడి దుర్గా ప్రసాద్, కొండ్రెడ్డి మనోజ్ తదితరులు ముఠాగా ఏర్పడి 2014 డిసెంబర్ నుంచి గత మార్చి వరకు నాలుగు నెలల వ్యవధిలో సుమారు 20 మంది మహిళలను దోచుకున్నారు. అంతేకాక అత్యాచారం కూడా చేశారు.
పరువుపోతుందని బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. వీరిలో మహిళలతో పాటు విద్యార్థినులు కూడా ఉన్నారు. ఓ విద్యార్థిని ఫిర్యాదు మేరకు విషయం విజయవాడ పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వీరిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ దోపిడీ బృందం తాడేపల్లిలోని సీతానగర్లో గత నెల 22న అర్థరాత్రి ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి కత్తితో బెదిరించి బంగారపు ఆభరణాలను దోచుకున్నారు. ఆయన కూతురిపై కూడా అత్యాచారయత్నం చేశారు. ఆమె ప్రతిఘటించి కేకలు పెట్టటంతో నిందితులు పరారయ్యారు. నిందితుల నుంచి కత్తి, బంగారపు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.