భూమా చేరిక: చంద్రబాబుకు మరో తలనొప్పి, గంగుల అసంతృప్తి
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన శాసనసభ్యులు భూమా నాగిరెడ్డిని, అఖిలప్రియను పార్టీలో చేర్చుకోవడంతో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కొత్త తలనొప్పి ప్రారంభమైంది. భూమాను చేర్చుకోవడంపై తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇంచార్జీ గంగుల ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
భూమా చేరిక నేపథ్యంలో చంద్రబాబుతో గంగుల ప్రభాకర్ రెడ్డి సమావేశం కానున్నారు. పార్టీలోకి కొత్తవారి రాక వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతారని గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గ్రామస్థాయిలో కార్యకర్తలు కొత్తవారితో కలిసి పనిచేసే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. తమ అభ్యంతరాలను, ఇబ్బందులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో చెబుతామని అన్నారు.
గుంగుల, భూమా వర్గాల మధ్య ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైరం ఉంది. ఓ వర్గం ఓ పార్టీలో ఉంటే, మరో మరో పార్టీలో ఉంటుంది. భూమా నాగిరెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు గంగుల ప్రతాపరెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెసులో ఉన్నారు. ఆ తర్వాత గంగుల సోదరులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు.
ప్రస్తుతం భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయనతో గంగుల ప్రభాకర్ రెడ్డి వర్గం కలిసి పనిచేస్తుందా అనేది అనుమానం. కడప జిల్లాలోని జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం పరిస్థితే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోనూ ఉంటుంది. రెండు కత్తలు ఒక ఒరలో ఒదుగుతాయా అనేదే అనుమానం.