టీడీపీకి, వైసీపీకి అసలు తేడా అక్కడే ? వల్లభనేని వంశీ కామెంట్స్...
గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలు పెట్టి విఫలమైందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. ఇవాళ బాపులపాడు సచివాలయం 1 పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. ఆర్డీవో, సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సచివాలయ పరిధిలో 651 మంది లబ్ధిదారులకు వివిధ రకాల సర్టిఫికెట్లు అందజేశారు.
ఆనాడు జన్మభూమి కమిటీ సభ్యులు డబ్బులు తీసుకొని ప్రభుత్వ పథకాలకు అర్హులను చేశారని వంశీ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో జన్మభూమి సభలు పెడితే వేలకొలది అర్జీలు వచ్చేవన్నారు. టీడీపీ అధికారంలో ఎమ్మెల్యేగా ప్రజలకు మంచి చేయాలన్నా ప్రభుత్వంలో వ్యవస్థ ఉండేది కాదన్నారు. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీలు అమలు చేయలేడు అని టీడీపీ సీనియర్ నాయకులు చెప్పేవాళ్ళని వంశీ గుర్తుచేశారు.

టీడీపీ అమలు చేయలేని పథకాలు జగన్ ఎలా అమలు చేస్తాడని చెప్పడంతో తాను నమ్మేవాడినన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఎంత ప్రయత్నం చేసినా ఇవ్వలేకపోయామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ,వాలంటీర్లు వ్యవస్థ బాగా పనిచేస్తుందని వంశీ కితాబిచ్చారు. వాలంటీర్లు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం ద్వారా ప్రభుత్వ పథకాలు వెంటనే అందుతున్నాయని వంశీ తెలిపారు. జగనన్న సురక్ష ద్వారా గ్రామాల్లో ప్రజలకు మరింత లబ్ది చేకూరుతుందన్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ.. ఆ తర్వాత వైసీపీకి చేరువయ్యారు. గన్నవరంలో ఇతర వైసీపీ నేతల నుంచి పోటీ ఉన్నా ఆయనకే సీఎం జగన్ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో వంశీ గడప గడపకూ ప్రభుత్వంతో పాటు జగనన్న సురక్ష వంటి పథకాల ప్రచారం, ఇతర కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. నియోజకవర్గంలో వైసీపీ నేతల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నా టికెట్ పై ధీమాగా ముందుకెళ్తున్నారు.












Click it and Unblock the Notifications