రాజకీయాలకు గుడ్బై చెప్పే యోచనలో వల్లభనేని వంశీ- త్వరలో కీలక ప్రకటన..
కృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వంశీతో వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు అమీతుమీకి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు నిన్న వంశీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీటిపై చర్చించేందుకు ఇవాళ తన అనుచరులతో ఎమ్మెల్యే వంశీ భేటీ అయ్యారు.
కార్యకర్తలతో భేటీలో వంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా.. దుట్టా, యార్లగడ్డ వర్గాలు రెచ్చగొట్టే రాజకీయాలు నడపటం, తరచూ గ్రామాల్లో గొడవలుసృష్టించి తనపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారని వంశీ ఆరోపించారు. జగన్ ప్రభంజనంలోనూ గెలిచిన వంశీకి వైసీపీలో ఆదరణ పెరుగుతుండటాన్ని సహించలేకే, వంశీ కారణంగానే గొడవలు జరుగుతున్నట్లు చిత్రీకరించడం, ఏకంగా ఎమ్మెల్యేపైనా కేసులు పెట్టాలని పోలీసులను ఒత్తిడి చేయడం పట్ల ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఇవాళ జిల్లాలోని బాపులపాడు మండలంలోని వివిధ గ్రామాల్లో వంశీ పర్యటించాల్సి ఉండగా.. యార్లగడ్డ తాజా విమర్శలతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యనేతలతో చర్చించారు. వంశీ రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. 15 ఏళ్లుగా సొంత డబ్బుతో ప్రజలకు సేవచేస్తూ ఎందుకూ కొరగాని నాయకులతో మాటలు పడుతూ రాజకీయాల్లో కొనసాగడం అవసరమా అని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో త్వరలో వంశీ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది.