గన్నవరం వైసీపీలో ఆగని రచ్చ-యార్లగడ్డ, దుట్టాపై వంశీ ఫైర్-మట్టి ఆరోపణలపై స్ట్రాంగ్ కౌంటర్
గన్నవరం వైసీపీలో ముందు నుంచి పార్టీలో ఉన్న నేతలకూ, టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మధ్య పోరు మరింత ముదిరింది. వంశీని టార్గెట్ చేస్తూ ప్రత్యర్ధినేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు చేస్తున్న ఆరోపణలు నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ తాజాగా స్పందించారు. తనపై మట్టి ఆరోపణలు చేయడం ద్వారా నియోజకవర్గంలో పేదలకు మట్టి దొరక్కుండా చేస్తున్నారని విమర్శించారు.
గన్నవరం గన్నవరం వైసీపీ పోరు
గన్నవరం వైసీపీలో ఎమ్మెల్యే వంశీకీ దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు మధ్య పోరు ముదురుతోంది. ఇప్పటికే వంశీకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో హోరాహోరీ తలపడుతున్న ఈ రెండు వర్గాలు ఇప్పుడు ఎన్నికలకు ముందు వంశీకి చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా దుట్టా, యార్లగడ్డ వర్గాలు చేస్తున్న మట్టి తవ్వకాల ఆరోపణలు వంశీకి తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలో వంశీ యథేచ్చగా మట్టితవ్వకాలు చేస్తూ మాఫియాను పెంచి పోషిస్తున్నారని దుట్టా, యార్లగడ్డ వర్గాలు చేస్తున్న ఆరోపణలు వంశీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇరుకున్న పడ్డ వంశీ
దుట్టా,యార్లగడ్డ వర్గాలు తరచుగా తనపై చేస్తున్న మట్టి తవ్వకాల ఆరోపణలు, ఎస్ఈబీకి వీటిపై ఇస్తున్న సమాచారం ఇప్పుడు ఎమ్మెల్యే వంశీకి ఇబ్బందిగా మారాయి. దుట్టా, యార్లగడ్డ వర్గాలకు చెందిన నేతలు ఎస్ఈబీకి మట్టి తవ్వకాలపై పూర్తి సమాచారం ఇవ్వడంతో అధికారులు దాడులు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై వంశీ ఆగ్రహంగా ఉన్నారు. ప్రత్యర్ధుల ఆరోపణలతో గన్నవరంలో మట్టి తవ్వకాల వ్యవహారం అధిష్టానం దృష్టికి కూడా వెళ్తుండటంతో వంశి ప్రత్యర్ధులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వంశీ స్ట్రాంగ్ కౌంటర్
మట్టి ఆరోపణల నేపథ్యంలో ప్రత్యర్ధులు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు కి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి ఎవడికైనా మట్టి ఎంటో, మట్టి కున్న ప్రాధాన్యత ఎంటో అర్ధం అవుతుందన్నారు. ఇదేదో గ్రానైట్ ,బాక్సైట్ , బొగ్గు , వెండి , బంగారం కాదన్నారు. కృష్ణపట్నం పోర్టు ,చెన్నై పోర్టు ఇతర దేశాల నుంచి మట్టిని తీసుకురావటం లేదు కదా అన్నారు. ఇక్కడ మట్టి తవ్వి కుప్పం తరలిస్తున్నారా అని ప్రశ్నించారు. మాంసం కన్నా మసాలా ఖర్చు ఎక్కువ అన్నట్లు మాదిరిగా మట్టి ఖర్చు కన్నా డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుందన్నారు. మట్టి డోల్ మైట్ , బాక్సైట్ , గ్రానైట్ లా మట్టి ఖరీదైన వస్తువు కాదన్నారు. బరువు ఎక్కువ ఖర్చు తక్కువ అన్నారు. ఇంగిత జ్ఞానం లేనివారు రాజకీయం వస్తే కటిక పేదవాళ్లు ఇబ్బందులు పడుతారని చెప్పారు. కటిక.పేదవాడైనా,కుబేరుడైనా తమ ఇళ్లు నిర్మాణం కోసం, రైతులు తమ పొలాలు మెరక తొలుకోవటానికి మట్టి ఎంతో అవసరం ఉంటుంది. వీరికి మట్టి ఎక్కడ నుంచి వస్తోంది గ్రామాల్లో చెరువుల నుంచి కాదా లేదంటే పై నుంచి బాబాలు దగ్గర నుంచి మట్టి వస్తోందా అన్నారు. ట్రాక్టర్లు, ప్రొక్లైయిన్ డీజిల్ కే ఖర్చు అవుతోందని డబ్బులు ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. వీళ్లంతా చంద్రబాబు స్కూల్ చెందిన వాళ్లు.. నీ మీదా బురద జల్లుతాం... తారు వేస్తాం మీరే ఉత్కోవాలి బాధ్యత మీదే అన్నట్లుగా ఇలాంటి విమర్శలు ఉంటాయిన్నారు