సుప్రీం ఆదేశంపై తెలంగాణకు గంటా, ఉమ్మడి నిబంధనలే
న్యూఢిల్లీ/హైదరాబాద్: విద్యార్థుల భవిష్యత్తు పైన తాము తీసుకున్న నిర్ణయాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సమర్థించిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం అన్నారు. రాష్ట్ర విభజనతో విద్యార్థులకు సంబంధం లేదని, ఆగస్టు 31వ తేదీన కౌన్సెలింగ్ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో గంటా స్పందించారు.
రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఏ ప్రభుత్వాలు అయినా పని చేయాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తాము తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించిందన్నారు. ఇప్పటికైనా కౌన్సెలింగ్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికత
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికత ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొందని అడిషనల్ ఏజీ అన్నారు. విభజన చట్టం ప్రకారమే స్థానికత, ఇతర అంశాలలో వెళ్లాలని సుప్రీం చెప్పిందన్నారు. ఉమ్మడి నిబంధనలు పాటించాలని అన్నారు.
ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకే కౌన్సెలింగ్ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని ఏపీ తరఫు న్యాయవాది తెలిపారు. ఆంధ్రా, తెలంగాణ పదాలే వద్దని చెప్పిందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికతను నిర్ధారించాలని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు.