తెరమీదకు కొత్త వాదన .. ఆర్ధిక రాజధానిగా వైజాగ్ ను ప్రకటించాలనే డిమాండ్ .. ఎందుకంటే !!
ఏపీ రాజధాని పై బొత్స రేపిన దుమారం రోజుకో కొత్త ప్రతిపాదనలతో, ఆసక్తికర వ్యాఖ్యలతో, అనూహ్య పరిణామాలతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరికి తోచినట్టు వారు రాజధానిపై మాట్లాడడం ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఇక రాజధాని అంశంపై ఇంత రగడ జరుగుతున్న సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మౌనం వహించడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని పై తన స్టాండ్ ఏంటో తెలియజేయాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తోంది.

విశాఖను ఆర్థిక రాజధానిని చేయాలన్న డిమాండ్ .. వైజాగ్ పేరు ప్రస్తావించటానికి కారణాలివే
ఇక ఇదే సమయంలో ఒకవేళ రాజధాని వికేంద్రీకరణ అవసరమైన ప్రభుత్వం భావిస్తే విశాఖ ఆర్థిక రాజధాని చేయాలనే ప్రతిపాదన పెడుతున్నారు టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. నిన్న సిఆర్డిఏ మీటింగ్ తర్వాత కూడా బొత్సా సత్యనారాయణ రాజధాని వికేంద్రీకరణ అవసరాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే భావనను వ్యక్తం చేశారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఏం మాట్లాడకుండానే, తన నిర్ణయం ప్రకటించకుండానే వెళ్లిపోయారు. ఇక రాజధాని మార్పు అంశంపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. విశాఖను ఆర్థిక రాజధానిని చేయాలన్నారు గంటా శ్రీనివాసరావు. ప్రస్తుతం వైజగ్ ఆంధ్రాలో అతిపెద్ద నగరం అని అందరికీ తెలుసు. దీనికి ఒక ప్రధాన ఓడరేవు, నేవీ, పెద్ద పారిశ్రామిక సంస్థలు, విమానాశ్రయం, ఐటి మరియు ఫార్మా హబ్లు వచ్చాయి. ఈ కారణంగానే విశాఖపట్నం ఇప్పటికే ఆంధ్ర ఆర్థిక రాజధానిగా ప్రాచుర్యం పొందింది. భౌగోళిక ప్రతికూలత కారణంగా మాత్రమే, దీనిని మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క పరిపాలనా రాజధానిగా చేయలేమని గంటా తెలిపారు.కానీ ఆర్ధిక రాజధానిగా చెయ్యొచ్చని చెప్పారు.

అన్ని అర్హతలు ఉన్నాయన్న గంటా... జగన్ నిశ్శబ్దం వీడాలన్న గంటా
ఆర్థిక రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయన్న గంటా జగన్ ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాజధాని మార్పు గురించి ఒకరికొకరు పొంతన లేకుండా చేస్తున్న మంత్రుల ప్రకటనలతో ప్రజలు, రైతుల్లో గందరగోళం నెలకొందని ఇప్పటికైనా రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలన్నారు. రాజధాని విషయంలో గతంలో జగన్ అసెంబ్లీ సాక్షిగా అంగీకారం తెలిపారని, ఎక్కడ రాజధాని ఏర్పాటు చేసినా 30వేల ఎకరాలు ఉండాలని ఆయన చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు గంటా శ్రీనివాసరావు.
సీఎం జగన్ నిశ్శబ్దాన్ని వీడాలని, రాజధాని అంశం పై తన స్పష్టమైన వైఖరిని తేటతెల్లం చేయాలని డిమాండ్ చేస్తున్న గంటా శ్రీనివాసరావు రాష్ట్ర రాజధాని అమరావతి లో అవినీతి ఆరోపణలపై ఎలాంటి దర్యాప్తు పైన తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

రాజధాని అమరావతిలో అక్రమాలు జరిగితే బయటపెట్టాలన్న గంటా
అమరావతి వద్ద రూ.9వేల కోట్లు మౌలిక సదుపాయాలకే ఖర్చయిందని ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలన్నారు మాజీ మంత్రి. శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోనూ రాజధాని ఏర్పాటుకు విజయవాడ, గుంటూరువైపే మొగ్గు చూపారని గంటా పేర్కొన్నారు. అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని.. ఒకవేళ అక్రమాలు జరిగితే ప్రభుత్వం బయటపెట్టాలన్నారు గంటా శ్రీనివాసరావు.
మొత్తానికి కొందరు ప్రకాశం జిల్లా అంటే, మరి కొందరు తిరుపతి అని, ఇంకొందరు నాలుగు రాజధానులు అని, ఇప్పుడు తాజాగా గంటా శ్రీనివాసరావు వైజాగ్ ఆర్థిక రాజధాని అని ఎవరికి తోచినట్లుగా వారు రాజధాని అంశం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటే చిరాకు పడుతున్న ప్రజలు అసలు ఈ వ్యవహారంపై జగన్ మౌనానికి గల కారణం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications