ఆయన ఎక్కడ గెలిచినా నియోజకవర్గానికి గుండు సున్నా?
గంటా శ్రీనివాసరావు. రాజకీయాల్లో సీనియర్ గా ఉన్నారు. వ్యాపారవేత్తగా మరోవైపు రాణిస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచి విశాఖపట్నం వలస వచ్చిన తర్వాత అక్కడే స్థిరపడ్డారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన ఎన్నో నియోజకవర్గాల్లో పోటీచేశారు. ఒక నియోజకవర్గంలో పోటీచేయగానే తర్వాత పోటీచేయాల్సిన నియోజకవర్గం కోసం పక్కచూపులు చూస్తారంటూ ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తారు.
భిన్నమైన రాజకీయవేత్త
ఎందుకంటే ఆయన ఎక్కడ గెలిచినా ఒకసారే.. ఒకచోటే. తర్వాత ఆ నియోజకవర్గాన్ని వదిలేస్తారు. వదిలేసే ఉద్దేశంతో ఉంటారు కాబట్టే నియోజకవర్గానికి అది చేయాలి.. ఇది చేయాలి.. అంటూ ఆరాటపడరనే విమర్శలున్నాయి. ఒక నియోజకవర్గంలో విజయం సాధించిన తర్వాత నుంచే తర్వాత ఎన్నికల్లో పోటీచేయడానికి మరో నియోజకవర్గం గురించి ఆలోచిస్తారు. ఏ రాజకీయ నాయకుడైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల చేత మన్ననలందుకొని రెండోసారి గెలవాలనే ఉద్దేశంలో ఉంటారు. కానీ గంటా రాజకీయం అందుకు భిన్నంగా సాగుతుంటుంది.
స్థానిక నాయకులతో చెట్టపట్టాల్
తన రాజకీయ చాతుర్యాన్ని ఉపయోగించి స్థానికంగా బలమైన నాయకులుగా చెలామణి అయ్యేవారిని మచ్చిక చేసుకుంటారు. పోటీచేయడానికి ముందే నియోజకవర్గంలో పునాది వేసుకుంటారు. తర్వాత ఆయన విజయం సులభమవుతుంది. 2004లో తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ గాలిని తట్టుకొని ఆయన గెలవగలిగారంటే రాజకీయ చాణక్యం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
వచ్చే ఎన్నికల కోసం భీమిలీ?
1999 ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎంపీగా విజయం సాధించారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున భీమిలీ నుంచే ఎన్నికయ్యారు. 2019లో విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
అయితే ఆయన ఏమైనా అభివృద్ధి చేశారా? అని ప్రశ్నిస్తే మౌనమే సమాధానమవుతుందని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తారు. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీచేయాలనుకుంటున్నారో ఇంకా స్పష్టత రాలేదు. భీమిలీ నుంచి వైసీపీ తరఫున పోటీచేయాలనే ఉద్దేశంతో గంటా ఉన్నారు. ప్రస్తుతం అక్కడినుంచి అవంతి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీలో చేరితే భీమిలీ టికెట్ ఇస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత రాలేదు.