జగన్ పవన్లలో ఎవరొచ్చినా సరే.. బహిరంగ చర్చకు సిద్దం: గంటా సవాల్
జగన్, పవన్ ఇద్దరూ తమ అభిప్రాయాలు మార్చుకోవాలని గంటా శ్రీనివాసరావు సూచించారు.
హైదరాబాద్: విశాఖ ఆర్కే బీచ్ వేదికగా తలపెట్టిన హోదా దీక్షపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పత్యేక ప్యాకేజీతో కలిగే లాభాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్లలో ఎవరైనా సరే బహిరంగ చర్చకు రావాలని ఏపీ గంటా సవాల్ విసిరారు.
గురువారం ఉదయం విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహంలో మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.జగన్, పవన్ ఇద్దరూ తమ అభిప్రాయాలు మార్చుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ హోదాపై ఆందోళనలు జరిగినా.. అడ్డుకుని తీరుతామని తేల్చి చెప్పారు.

గతేడాది విశాఖలో జరిగిన పారిశ్రామిక సదస్సు తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై కూడా బహిరంగ చర్చకు సిద్దమని గంటా ప్రకటించారు. ఎవరైనా చర్చకు హాజరు కావచ్చని తెలిపారు. ఇకపోతే రేపటినుంచి విశాఖలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ఆధ్వర్యంలో జరగబోయే పారిశ్రామిక సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.
సదస్సుకు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు హాజరవుతారని తెలిపారు. 50 దేశాల నుంచి 2 వేల మందికి పైగా ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారని అన్నారు. అయితే సదస్సును అభాసుపాలు చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని మంత్రి గంటా ఆరోపించారు. ఆంధ్రా యువత పేరిట జగన్, పవన్ లు ర్యాలీలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు.












Click it and Unblock the Notifications