తలదించుకోవాలి: రిషికేశ్వరి మృతిపై గంటా, అరాచక విద్యార్థులకు తీవ్ర హెచ్చరిక
చిత్తూరు/గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం నాడు అరాచక విద్యార్థులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆయన చిత్తూరు జిల్లా తిరుపతిలో మాట్లాడారు. ఆయన విశ్వవిద్యాలయాల వీసీల సమావేశానికి వచ్చారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... యునివర్సిటీలలో అరాచకాలు సృష్టించే విద్యార్థులను ఎక్కడా చదువుకోని విధంగా నిషేధాజ్ఞలు అమలు చేస్తామని హెచ్చరించారు. కులాల పేరిట విద్యార్థులను వేధించే వారి పైన ఉక్కుపాదం మోపుతామన్నారు. వర్సిటీలో పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రిషికేశ్వరి మృతి ఘటన సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని గంటా శ్రీనివాస్ రావు అన్నారు. విశ్వవిద్యాలయాల్లో కుల, మత విద్యార్థి సంఘాలు, యూనియన్ల పైన ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.
మూడు నెలలకు ఓసారి వైస్ ఛాన్సలర్లతో సమావేశమవుతామని చెప్పారు. రిషికేశ్వరి మృతిపై నిజ నిర్ధారణ కమిటీ వేశామని చెప్పారు. వర్సిటీల్లో బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు బార్ కోడ్ ఐడీ కార్డులు ఇవ్వాలన్నారు. తెలివైన అమ్మాయి రిషికేశ్వరి అలా చేయడం బాధాకరమన్నారు.

జూడిషియల్ జరపాలి
రిషికేశ్వరి మృతి పైన జూడిషియల్ విచారణకు ఆదేశించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విశ్వవిద్యాలయం మూసివేతతో సమస్య పరిష్కారం కాదన్నారు. స్టాఫ్, ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తే ర్యాగింగ్ భూతం అంతమవుతుందని చెప్పారు.
వైసీపీ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ
రిషికేశ్వరి మృతి పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రబ్బానీ చెప్పారు. అరండల్ పేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం మాట్లాడారు.
రిషికేశ్వరి ఆత్మహత్య వ్యవహారంలో ప్రభుత్వం, విశ్వవిద్యాలయ అధికారుల ధోరణి పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కేసు తీవ్రతను నీరుగార్చేందుకు వర్సిటీ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఘటన పైన తాము ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీకి 15 రోజుల గడువ ఇవ్వడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున తాము నిజనిర్ధారణ కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.












Click it and Unblock the Notifications