గరికపాటి వివాదం: పద్మశ్రీతో గౌరవిస్తే, దానికి సార్థకత తెచ్చేలా సలహాలు ఇవ్వాలి కానీ అవమానిస్తారా?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం పైన ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారంగా మారాయి. ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశాన్ని చూడాలని కొందరు చెబుతుంటే, మరికొందరు ఆయన అత్యంత అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారని మండిపడుతున్నారు. గరికపాటి స్థాయికి అవి తగిన మాటలు కావని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గరికపాటి విజ్ఞత అది: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
తాజాగా ఈ అంశం పైన ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి స్పందించారు. విద్యార్థులకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించడం అనేది రాజకీయ నిర్ణయం కాదని, న్యాయస్థానాల ఆదేశాల మేరకు పేద విద్యార్థులకు ఇది ఒక హక్కుగా మారిందని ఆయన స్పష్టం చేశారు. గరికపాటికి ఈ పథకం వివరాలు పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు అని, ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు.

మధ్యాహ్న భోజన పథకం పిల్లల జన్మహక్కు
మధ్యాహ్న భోజనం పిల్లల జన్మహక్కు అని విలాసం కాదని విజయ్ ప్రతాప్ రెడ్డి తేల్చి చెప్పారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ప్రతి పౌరుడికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని, జీవించే హక్కు అంటే కేవలం బతకడమే కాదని గౌరవప్రదంగా ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకుని బ్రతకడం అని ఆయన గుర్తు చేశారు.
కడుపు ఖాళీగా ఉంటే పిల్లలు చదువులపై శ్రద్ధ పెట్టలేరు
ఇది అందరి హక్కు అని ఆయన పేర్కొన్నారు. కడుపు ఖాళీగా ఉంటే పిల్లలు చదువు పైన శ్రద్ధ పెట్టలేరని, మధ్యాహ్న భోజనం లేకుండా విద్యాహక్కు చట్టం లక్ష్యం నెరవేరదని ఆయన వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయని తెలిపిన ఆయన ఈ పథకం అమలయ్యే వ్యయంలో 60 శాతం కేంద్రానిది, 40 శాతం రాష్ట్రానిది అని పేర్కొన్నారు.
పేదరికంలో ఉన్న వారి కోసం ఈ పథకం
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమలు కోసం ఒక కమిషన్ ను నియమించినట్టుగా చెప్పిన ఆయన మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు చేయడం కోసం అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.ఎదిగే పిల్లల కోసం, పేదరికంలో ఉన్న వారి కోసం ఈ పథకం ద్వారా వారంలో ఐదు రోజులు ఐదు గుడ్లు ఇస్తున్నారని, దీనిని కూడా విమర్శించడం తమను చాలా బాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆ వ్యాఖ్యలు బాధాకరం
ఎవరైనా విద్యార్థికి ఒక పూట బాయిల్డ్ ఎగ్ ఇవ్వలేదని, ఒకపూట భోజనం పెట్టలేదని పిటిషన్ దాఖలు చేస్తే 125% ఫైన్ వేస్తున్నామన్నారు. సుమోటోగా కేసులను సైతం నమోదు చేస్తున్నామని విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. నిత్య పెళ్ళికొడుకు, శోభనం పెళ్ళికొడుకు, గాడిదగుడ్డు వంటి వ్యాఖ్యలు చాలా బాధించాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మీకు పద్మశ్రీతో గౌరవిస్తే, దానికి సార్థకత తెచ్చేలా సలహాలు ఇవ్వాలి తప్ప అవమానకరంగా మాట్లాడొద్దని ఆయన ఘాటుగా స్పందించారు.
పేదరికాన్ని కించపరిచేలా గరికపాటి వ్యాఖ్యలు
పేద పిల్లలు మనకు లెక్క లేరా? వాళ్లు మన దేశానికి వెన్నెముక కాదా.. వాళ్లే మన భవిష్యత్తు కాదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ బడిలో చదివి ఎంతో మంది గొప్ప స్థానాలకు చేరుకున్నారని గుర్తు చేశారు.గరికపాటి చేసిన వ్యాఖ్యలు మధ్యాహ్న భోజన పథకాన్ని మాత్రమే కాదు, ప్రభుత్వ పాఠశాలలను, పేదరికాన్ని కూడా కించపరిచేలా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications