ఏపీలో కొత్త స్కీం.. పేద బ్రహ్మణుల కోసం, రూ.10 వేలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు గరుడ అనే కొత్త పథకం ప్రారంభించబోతుంది. తాజాగా నిరుపేద బ్రాహ్మణులకు ఆర్థిక సాయం చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. గరుడ సహాయ పథకం పేరుతో పేదలకు సహయం అందించబోతున్నారు.
ఈ స్కీమ్ కింద నిరుపేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ పథకానికి రూ.75 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులుగా పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరణించిన 40 రోజులలోపు ఆయా కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కోసం http://andhrabrahmin.ap.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఈ నగదు వ్యవహారాలను చూసుకోనుంది. అయితే అంత్యక్రియల ఖర్చుల పథకానికి దరఖాస్తు చేయాలంటే కుల ధృవీకరణ పత్రం తప్పనిసరి అని పేర్కొంది. మరణించిన వారి డెత్ సర్టిఫికెట్ ఉండాలని తేల్చి చెప్పింది. అలాగే కుటుంబ ఆదాయం రూ.75వేల కంటే ఎక్కువ ఉండకూడదని సూచించింది. మరణించిన వారి గుర్తింపు కార్డులు, దరఖాస్తు చేసే కుటుంబ సభ్యులు గుర్తింపు కార్డులు ఉండాలని కోరింది. ఆన్లైన్లో www.andhrabrahmin.ap.gov.in అప్లయ్ చేయాలని కోరింది.
పురోహితులకు వేతనాలు అందజేస్తోన్న సర్కార్.. అంత్యక్రియల ఖర్చుల కోసం నిధులు అందజేస్తోంది. ఇమామ్, ఫాస్టర్లకు కూడా గౌరవ వేతనాలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. మరో అడుగు ముందుకువేసి.. బ్రహ్మణుల అంత్యక్రియల కోసం నిధులను సమకూరుస్తోంది.