హమ్మయ్యా.. ఉప్పూడిలో అదుపులోకి వచ్చిన గ్యాస్, ప్లాన్-2 ప్రకారం మడ్ పంపింగ్తో నియంత్రణ
ఎట్టకేలకు గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చింది. గత మూడురోజుల నుంచి జరుగుతున్న ప్రయత్నాలకు ఫలితం లభించింది. గ్యాస్ లీకేజీని ఓఎన్జీసీ నిపుణులు అదుపులోకి తీసుకురావడంతో ఉప్పూడి వాసులు ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్యా అంటూ కాస్త రిలాక్స్ అయ్యారు. ప్లాన్-1 విఫలమవడంతో ప్లాన్-2 అమలు చేశారు. మడ్ పంపింగ్ ద్వారా ఎగిసిపడుతోన్న గ్యాస్ను నియంత్రించగలిగారు.
చమురు నిక్షేపాల కోసం..
ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఘటన జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో గల గంటవారిపేట చమురు నిక్షేపాలు గల బావి నుంచి గ్యాస్ ఎగజిమ్మింది. వాస్తవానికి బావిని 2006లో తవ్వారు. కానీ తర్వాత ఓఎన్జీసీ చమురు నిక్షేపాలు లేవని గ్యాస్ వెలికితీతను నిలిపివేసింది. కానీ ఇటీవల పీఎఫ్హెచ్ కంపెనీకి గ్యాస్ వెలికితేసే పనిని అప్పగించారు. దీంతో కంపెనీ ప్రతినిధులు చమురు నిక్షేపాల కోసం ప్రయత్నించారు.
వాల్కి తగలి
ఆదివారం పీఎఫ్హెచ్ కంపెనీ చమురు నిక్షేపాలను వెలికితీసే ప్రయత్నం ప్రారంభించారు. బావిలో ప్రక్రియ చేపట్టే సమయంలో వాల్కు మర అడ్డుకొంది. గట్టిగా తగలడంతో గ్యాస్ బయటకొచ్చింది. దీంతో ఆ సమీపంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆదివారం నుంచి గ్యాస్ అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. ప్లాన్-1 విఫలం అవడంతో ప్లాన్-2ను తెరపైకి తీసుకొచ్చారు. పీఎఫ్హెచ్ కంపెనీ ప్రతినిధులు, ఓఎన్జీసీ సిబ్బందితోపాటు ముంబై ప్రతినిధులు మడ్ పంపింగ్ ద్వారా గ్యాస్ను నియంత్రించారు.
80 వేల లీటర్ల బురదనీరు
ఇసుక, రసాయనాలతో కూడిన 80 వేల లీటర్ల బురద నీటిని లోపలికి పంపించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన మడ్ పంపింగ్ ప్రక్రియ 11 గంటల సమయంలో ముగిసింది. గ్యాస్ బ్లో అవుట్ను విజయవంతంగా అడ్డుకున్నారు. దీంతో సమీప ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా ఉప్పూడ వాసులు కాస్త రిలాక్సయ్యారు. గత మూడురోజుల నుంచి వారికి కంటినిండ నిద్రలేదు, కడుపునిండా తిండిలేని పరిస్థితి నెలకొంది.
అంధకారంలో ప్రజలు
ఉప్పూడిలో గల బావిలో గ్యాస్ ఎగజిమ్మడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాట్రేనికోన మండలంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మొబైల్ సిగ్నల్స్ కూడా బ్రేక్ చేశారు. ఆదివారం నుంచి సహాయక చర్యలను చేపడుతూనే ఉన్నారు. కానీ 2.2 కిలోమీటర్ల లోతులో ఉన్న బావిలోకి మడ్ పంపింగ్ ప్రక్రియ విజయవంతమైంది. గ్యాస్ నిలిపివేత చర్యలను డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి విశ్వరూప్, స్థానిక నేతలు దగ్గరుండి పర్యవేక్షించారు.