తాడిపత్రి స్టీల్ప్లాంట్లో గ్యాస్ లీక్: ఆరుగురు మృతి, మరో ఐదుగురికి తీవ్ర అస్వస్థత
అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి స్టీల్ ప్లాంట్(గెరుడౌ)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్(విష వాయువులు) లీకవడంతో అక్కడ పనిచేస్తున్న ఆరుగురు సిబ్బంది మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైనవారిని అనంతపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోని కారణంగానే ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆరుగురు మృతి చెందడంతో వారి బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మృతుల బంధువులు కోరుతున్నారు అనంతపురంతోపాటు ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఈ ప్లాంట్లో పనిచేస్తున్నారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
గ్యాస్ లీకై ఆరుగురు మృతిచెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై అధికారులను వివరాలు అడిగితెలుసుకున్నారు. బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.